INDIA Bloc: నేడు ఈసీ ఆఫీస్ ముట్టడికి ఇండియా కూటమి సిద్ధం..
ABN, Publish Date - Aug 11 , 2025 | 08:29 AM
దేశ రాజకీయం మళ్లీ మరింత వేడెక్కింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళనకు సిద్ధమైంది.
ఢిల్లీ: దేశ రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరిగింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సరిగా లేదని ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ ఆందోళనకు (India Bloc protest August 11 EC) సిద్ధమైంది. ఈ సోమవారం (ఆగస్టు 11న) ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం వరకు 300 మందికి పైగా ఎంపీలు మార్చ్ చేయబోతున్నారు. కానీ, ఈ మార్చ్కు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు.
ఎందుకీ ఆందోళన?
ఇండియా కూటమిలోని 25 పార్టీల ఎంపీలు ఈ మార్చ్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, ఆప్, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీ, ఎన్సీపీ(SP), శివసేన (UBT), నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈ ర్యాలీలో ఉంటాయి. పార్లమెంట్ ఎంట్రెన్స్ నుంచి ఉదయం 11:30 గంటలకు ఈ మార్చ్ ప్రారంభం కానుంది. బిహార్లో SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓట్ల చోరీ ఆరోపణలను హైలైట్ చేయనున్నారు.
అనుమతి లేదు, కానీ..
అయితే, ఢిల్లీ పోలీసులు ఈ మార్చ్కు అనుమతి లేదన్నారు. ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ, ఈ మార్చ్కు అధికారికంగా అనుమతి కోసం ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని చెప్పారు. కానీ, ఇండియా కూటమి ఈ ఆందోళనను ఎలాగైనా చేయాలని ఫిక్స్ అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆప్ పార్టీ ఇటీవల ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినా, ఈ మార్చ్లో 12 మంది ఎంపీలతో పాల్గొంటోంది. టీఎంసీ ఎంపీ సాగరికా ఘోస్ మాట్లాడుతూ, ఇది విపక్షాల కార్యక్రమమని, ఆప్ కూడా రావాలని ఆశిస్తున్నామని చెప్పారు.
రాహుల్ గాంధీ ఆరోపణలు
2024 ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 1,00,250 ఓట్లు చోరీ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఐదు రకాల మానిపులేషన్ ద్వారా ఈ చోరీ జరిగిందని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అయితే, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తప్పంటూ కొట్టిపారేసింది. రాహుల్ గాంధీ ఈ ఆరోపణలకు సంబంధించిన డేటాను సమర్పించాలని ఈసీ కోరింది.
ప్రజలకు కాంగ్రెస్ పిలుపు
కాంగ్రెస్ ఆదివారం ఒక వెబ్ పోర్టల్ను కూడా లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ సపోర్ట్ను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం నుంచి పారదర్శకతను డిమాండ్ చేయవచ్చు. రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేస్తూ.. 'ఓటు చోరీ అనేది ఒక మనిషి, ఒక ఓటు అనే పునాది భావనపై దాడి. స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలకు ఓటర్ రోల్ తప్పనిసరి. డిజిటల్ ఓటర్ రోల్స్ను విడుదల చేయాలని, ప్రజలు, పార్టీలు వాటిని ఆడిట్ చేసేలా ఈసీ పారదర్శకంగా ఉండాలనేది మా డిమాండ్' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 11 , 2025 | 10:22 AM