Civil Judge Aspirant: వీడని మిస్టరీ.. జల్లెడ పడుతున్న పోలీసులు
ABN, Publish Date - Aug 19 , 2025 | 09:02 AM
మహిళలు ఒంటరి ప్రయాణాలు.. ఏ ప్రమాదానికి దారి తీస్తాయో తెలియడం లేదు. ఒంటరిగా వెళ్లి.. అదృశ్యమవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి.
భోపాల్, ఆగస్ట్ 19: లా డిగ్రీ అందుకుని.. సివిల్ జడ్జి కావాలని లక్ష్యంగా పెట్టుకున్న.. ఆ దిశగా ప్రయత్నాల్లో ఉన్న యువతి అర్చనా తీవారి. ఆమె ఒక్కసారిగా మాయమైంది. అది కూడా రైలులో ప్రయాణిస్తూ.. ఆమె అదృశ్యమైంది. దీంతో అర్చనా తీవారి (29) అదృశ్యమైన ఘటన మధ్యప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇండోర్ నుంచి కట్నీకి తరచూ అర్చనా తీవారి రైలులో ప్రయాణిస్తోంటుంది. ఎప్పటి లాగానే ఆగస్టు 7వ తేదీ రాత్రి ఇండోర్ నుంచి కట్నీకి నర్మదా ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తుంది. ఆ రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందులోభాగంగా వారు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అందులో భాగంగా ఆమె ప్రయాణిస్తున్న బోగిలోని ప్రయాణికులకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఆమె బ్యాగును ఉమారియా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు కనుగొన్నారు. ఆమె సెల్ ఫోన్ లోకేషన్.. రాణి కమల్పట్నిస్టేషన్ వద్ద చివరిగా గుర్తించారు. కానీ ఆ తర్వాత ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అర్చనా అదృశ్యమయ్యే కొన్ని నిమిషాల ముందు.. తల్లితో ఆమె మాట్లాడింది. అనంతరం అర్చనా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక ఈ విచారణలో భాగంగా నర్మదాపురం, పవర్ ఖేదా, ఇతార్సీ తదితర ప్రాంతాలను కలిపే గ్రిడ్లోని సీసీ టీవీ కెమెరాలను జీఆర్పీ, రైల్వే పోలీసులు జల్లెడ పడుతున్నారు.
అలాగే అర్చనా తీవారి అదృశ్యంపై భోపాల్ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. 20 నుంచి 25 మందితో కూడిన పోలీసు బృందాలు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు. అదే విధంగా కొండ, అటవీ ప్రాంతాల్లో సైతం డాగ్ స్క్వాడ్ బృందాలు శోధిస్తున్నాయన్నారు. అలాగే కాల్ డిటైల్ రిపోర్ట్ను సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
అందులోభాగంగా ఆమె స్నేహితులు, బంధువులను సైతం విచారిస్తున్నారు. అయితే ఆమె కిడ్నాప్ అయినట్లు వస్తున్న వార్తలను ఎస్పీ రాహుల్ ఖండించారు. అదే జరిగి ఉంటే.. కిడ్నాపర్ల నుంచి తమకు ఇప్పటికే డిమాండ్లు అందేవని వివరిస్తున్నారు. కానీ ఆమె రైలులో ప్రయాణించిన సమయంలో.. భక్తుల రద్దీ తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కానీ కుట్ర కోణంతో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్పీ రాహుల్ కుమార్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వీడని మిస్టరీ.. జల్లెడ పడుతున్న పోలీసులు
For More National News And Telugu News
Updated Date - Aug 19 , 2025 | 10:58 AM