Russia-Ukraine Peace: పుతిన్, జెలెన్స్కీ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి: డొనాల్డ్ ట్రంప్
ABN, Publish Date - Aug 19 , 2025 | 07:59 AM
త్వరలో పుతిన్, జెలెన్స్కీ భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అన్నారు. శాంతి స్థాపన దిశగా ఇది తొలి అడుగని కూడా వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇది తొలి అడుగు అని అన్నారు. శ్వేతసౌధంలో ఐరోపా నేతలు, నాటో అధికారులు, ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్స్కీతో సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. శాంతి స్థాపనకు చర్చల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ట్రూత్ సోషల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఓవల్ ఆఫీసులో అతిథులతో గొప్ప సమావేశం జరిగింది. ఉక్రెయిన్ భద్రతపై చర్చించాము. శాంతి నెలకొల్పే అవకాశాలు మెరుగవ్వడంతో అంతా హర్షం వ్యక్తం చేశారు. ఆ తరువాత పుతిన్తో ఫోన్లో మాట్లాడాను. జెలెన్స్కీతో మీటింగ్కు ఏర్పాట్లు మొదలయ్యాయి. భేటీ ఎక్కడ అనేది వారిద్దరూ నిర్ణయిస్తారు. ఆ తరువాత అమెరికా, ఉక్రెయిన్, రష్యా త్రైపాకిక్ష సమావేశం కూడా జరుగుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ భేటీకి ఏర్పాట్ల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కలిసి పని చేస్తున్నారని అన్నారు.
ట్రంప్, పుతిన్ దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారని శ్వేత సౌధం వర్గాలు తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్ బృందాల మధ్య నేరుగా చర్చలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపాయి. ఉక్రెయిన్తో పాటు ఇతర అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిపాయి. అమెరికా, రష్యా మధ్య చర్చలు ఇదే స్థాయిలో కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
ఇక జెలెన్స్కీతో చర్చల సందర్భంగా ట్రంప్ నాటో సభ్యత్వ అంశాన్ని ప్రస్తావించారు. నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఉండదని స్పష్టం చేశారు. రష్యా చేతిలో ఉన్న క్రిమియాపై కూడా ఆశలు వదులుకోవాలని కూడా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. అలాస్కాలో ట్రంప్తో జరిగిన మీటింగ్ వివరాలను పుతిన్ బారత ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఉక్రెయిన్తో శాంతి స్థాపనకు అన్ని విధాలుగా సహకరిస్తానని మోదీ తెలిపారు. ఈ మేరకు పుతిన్ ఫోన్ కాల్ వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన తెలిపింది.
ఇవి కూడా చదవండి:
పాక్లో ప్రకృతి విలయం.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. అధికారుల్లో ఆందోళన
అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్పై 50 శాతం సుంకం తప్పదా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 19 , 2025 | 08:44 AM