సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం..
ABN, Publish Date - Nov 17 , 2025 | 08:57 AM
భారతీయ యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు - ట్యాంకర్ ఢీకొట్టుకున్న సంఘటనలో పెద్ద సంఖ్యలో యాత్రికులు చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు కాగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులుగా తెలుస్తోంది. బదర్-మదీనా మధ్య ముఫరహత్ దగ్గర ఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం.
మక్కాలో ప్రార్థనలు ముగించుకుని వెళుతూ..
సోమవారం తెల్లవారు జామున యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులందరూ నిద్రలో ఉన్నారు. ఎక్కువ మంది నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకరికంటే ఎక్కువ మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవటం విషాదకరం. స్థానిక మీడియా కథనాల ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలం దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాయి. ఇండియన్ ఎంబసీ ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హజ్ కమిటీ, ఇండియన్ ఏంబసీ బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
పిచ్చి పీక్స్.. ఇండియాలో మొదటి జాంబీ మ్యాన్ ఇతనే..
మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు.. హింసాత్మక దాడుల్లో 120 మందికి గాయాలు..
Updated Date - Nov 17 , 2025 | 02:56 PM