Iran Vs Israel: యూఎస్ను హెచ్చరించిన ఇరాన్
ABN, Publish Date - Jun 23 , 2025 | 10:56 AM
ఇరాన్లో మూడు అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి కాస్తా ఘాటుగా స్పందించారు.
వాషింగ్టన్, జూన్ 23: ఇరాన్లో కీలక అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఈ దాడులతో దౌత్య సంబంధాలను అమెరికా నాశనం చేస్తుందంటూ ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ మండిపడ్డారు. అయితే అమెరికా వ్యవహారాన్ని ఎప్పుడు ఏం చేయాలనేది తమ దేశ సైన్యం చూసుకుంటుందని ఇర్వానీ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన చర్యలు చేపడుతుందని వివరించారు. ఆదివారం ఇరాన్లోని ముఖ్య అణు స్థావరాలు.. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్పై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా శాంతి, భద్రతలకు పొంచి ఉన్న ముప్పు అనే అంశంపై చర్చించింది. ఈ సందర్భంగా ఇరాన్ రాయబారి అమిర్ సయ్యద్ ఇర్వానీ మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికాను పదే పదే తాము సూచించినట్లు వివరించారు.
జూన్ 13, జూన్ 21వ తేదీల్లో ఇరాన్పై ఇజ్రాయెల్, యూఎస్ నిర్వహించిన దాడులను ఈ సందర్భంగా ఇర్వానీ ఖండించారు. ఈ రెండు దేశాలు అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించాయని మండిపడ్డారు. యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్తోపాటు యూరోపియన్ యూనియన్లు రాజకీయ, చట్టవిరుద్ధంగా ప్రేరేపించిన చర్యల ఫలితంగా అవి జరిగాయని పేర్కొన్నారు. దౌత్య మార్గాలను ఇజ్రాయెల్ నాశనం చేస్తుందని విమర్శించారు. దౌత్యాన్ని నాశనం చేయాలని ఆ దేశం కంకణం కట్టుకుందంటూ ఇజ్రాయెల్పై ఇర్వానీ నిప్పులు చెరిగారు.
ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై ఇర్వానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌత్య సంబంధాలును అమెరికా నాశనం చేయాలని నిర్ణయించుకుందని గత వారం పలు యూరోపియన్ సభ్య దేశాలతో ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జరిపిన చర్చల్లో స్పష్టమైందని తెలిపారు. అలాంటి వేళ.. ఈ పరిస్థితిని ముగింపు ఎక్కడని ఇర్వానీ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
మరోవైపు దేశంలోని అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన వెంటనే ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ స్పందించారు. ఆ క్రమంలో ఇజ్రాయెల్పై ఆయన నిప్పులు చెరిగారు. కానీ ఇరాన్లోని అణు స్థావరాలపై దాడులు నిర్వహించిన అమెరికాపై ఆయన పల్లెత్తు మాట కూడా మట్లాడ లేదన్న విషయం తెలిసిందే. కానీ ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ రాయబారి ఇర్వానీ మాత్రం అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
తెలంగాణలో రచ్చ రేపుతూన్న ఓ డైలాగ్..
For More International News and Telugu News
Updated Date - Jun 23 , 2025 | 11:59 AM