Letters That Still Speak: ఆ లేఖల్ని ఇప్పటికీ తీసి చదువుకుంటాను
ABN, Publish Date - Oct 27 , 2025 | 06:00 AM
1974లో తొమ్మిదవ తరగతిలో రాసిన తొలి కవితతో నా సాహిత్య ప్రయాణం మొదలయింది. 1984లో కలకత్తాలో బ్యాంకు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నా అధ్యయనమూ సృజనా...
1974లో తొమ్మిదవ తరగతిలో రాసిన తొలి కవితతో నా సాహిత్య ప్రయాణం మొదలయింది. 1984లో కలకత్తాలో బ్యాంకు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నా అధ్యయనమూ సృజనా వేగవంతమవుతూ వచ్చాయి. 1987లో గుంటూరులో పని చేస్తున్నపుడు ఒక రోజు ‘నవోదయం’ అనే సాహిత్య పత్రికలో ఒక పురస్కార ప్రకటన చూసాను. కవుల నుంచి అముద్రిత కవితా సంపుటాలను ఆహ్వానిస్తూ, ఉత్తమ కవితా సంపుటికి ‘గ.న.రా’ పేరిట సాహిత్య పురస్కారాన్ని ఇస్తా మని, ఎంపికైన సంపుటిని తామే ప్రచురిస్తామని చెబుతూ జి.వి.బి. నరసింహారావు అనే తెలుగు టీచర్ ఇచ్చిన ప్రకటన అది. ఆయన మరెవరో కాదు, ఆ తర్వాతికాలంలో మహాసహస్రావధానిగా ప్రసిద్ధుడు గరికపాటి నరసింహారావు.
1974 నుంచి 1981 వరకు నేను రాసిన దాదాపు వంద కవితలను పూర్తిగా పక్కకు పెట్టి, 1982 నుంచి 1987 వరకు రాసిన వంద కవితల నుంచి నాకు నాణ్యంగా అనిపించిన 28 కవితలను ఎంపిక చేసుకుని సంపుటిగా కూర్చి ‘రాబందుల రెక్కల చప్పుడు’ అనే టైటిల్తో ‘గ.న.రా. సాహిత్య పురస్కారం’ కోసం పంపాను. నా సంపుటి అవార్డుకు ఎంపికైందని తెలిసి చాలా సంతోషించాను. సంపుటిలోని కవితల సారంతో అన్వయంగా వుండాలని కవితా సంపుటి టైటిల్ను ‘జీవన వీచిక’గా మార్చాను.
ముందుమాట రాయమని కళావేత్త సంజీవదేవ్ను కోరాను. ఆయన అందమైన కాగితం మీద అందమైన చేతి రాతతో ‘ధ్వని’ శీర్షికతో ముందుమాటను రాసి పంపారు. కొల్లూరు వెంకట్ అనే సాహిత్య మిత్రుడు అందించిన కవర్ పేజీ బొమ్మ నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా అందులోని కన్ను. పుస్తకాన్ని మా అమ్మకూ నాయినకూ అంకితమిచ్చాను. నరసింహారావు గారి కోరిక మేరకు గుంటూరులోనే ‘శంకర్ ప్రింటర్స్’లో పుస్తకాన్ని ముద్రణకు ఇచ్చాను. ప్రూఫ్ రీడింగ్ పనిని నేనే చూసుకున్నాను. 500 ప్రతులకు అయిన రూ.1800 ప్రింటింగ్ ఖర్చును పురస్కార ప్రదాత ప్రెస్సుకు చెల్లించారు. పుస్తకం ధర అయిదు రూపాయలు. ప్రెస్ నుంచి వచ్చిన పుస్తకాన్ని చూడగానే నేను అనిర్వచనీయ ఆనందోద్వేగాన్ని పొందాను.
తెనాలిలో ‘చైతన్య కళా స్రవంతి’ సంస్థ నిర్వహణలో 1988 జనవరి 10న పుస్తకావిష్కరణ జరిగింది. సంజీవదేవ్ పుస్తకాన్ని ఆవిష్కరించి లలితంగా ప్రసంగించారు. పాపినేని శివశంకర్, హితశ్రీ, పురస్కార న్యాయ నిర్ణేత తమ్మా సత్యనారాయణ పుస్తకం గురించి వివరంగా ప్రసంగించారు. పురస్కారం గురించీ పుస్తకం గురించీ నరసింహారావు ఎంతో నమ్రతతో మాట్లాడారు. నా సంపుటి లోని ‘రాబందుల రెక్కల చప్పుడు’ అనే కవితను గాయకుడు సాంబశివరావు సభలో అర్థవంతంగా పాడాడు.
‘జీవన వీచిక’ సంపుటిని మిత్రు లకూ, ప్రసిద్ధ కవులకూ పంపాను. ‘‘హరితం మీ కవితల్లో స్ఫురితమవుతోంది,’’ అన్నారు ఆరుద్ర ఓ కార్డు ద్వారా. ‘‘మీ ‘జీవన వీచిక’లో పెట్టిన శీర్షికకు, సాగిన కవితకు అర్థం వుంది. అన్వయం వుంది. మీ కవిత్వానికున్న మంచి గుణం స్పష్టత,’’ అంటూ సినారె ఉత్తరం రాశారు. ఇంకా ఎందరో పెద్దలూ మిత్రులూ లేఖలు రాశారు. ప్రతీ లేఖా కొత్త ఉత్తేజాన్నిచ్చింది. ఆ లేఖల్ని ఇప్పటికీ అప్పుడప్పుడూ తీసి చదువుకుంటూ, నాటి ఉత్సవ జ్ఞాపకాన్ని నెమరేసుకుంటాను.
94404 19039
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
హైదరాబాద్ యాపిల్ ఎయిర్పాడ్స్ తయారీ హబ్
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 27 , 2025 | 06:00 AM