YCP Jagan: నాపై కేసు కొట్టేయండి
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:40 AM
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టును కోరిన జగన్
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. కాగా, సింగయ్య మృతి ఘటనలో పోలీసులు తమపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజిని దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా కేసులో నిందితులుగా ఉన్న జగన్, వైవీ.సుబ్బారెడ్డి, జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి తరఫు న్యాయవాదులు స్పందించారు. ‘‘రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారు. ప్రమాదానికి వాహనం నడిపిన డ్రైవర్ బాధ్యుడు అవుతారు తప్ప అందులో ప్రయాణిస్తున్నవారు కాదు. పిటిషన్లపై అత్యవసరంగా విచారణ జరపాల’’ని అభ్యర్థించారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు, వ్యాజ్యాలపై గురువారం విచారణ జరుపుతామని చెప్పారు.
Updated Date - Jun 26 , 2025 | 05:40 AM