SIT Investigation: లిక్కర్ బాస్ల కోసం సిట్ వేట
ABN, Publish Date - May 11 , 2025 | 05:05 AM
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకమైన ముగ్గురు లిక్కర్ బాస్ల కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో సిట్ తనిఖీలు చేస్తున్నా, వారు అజ్ఞాతంలో వెళ్లిపోయారు.
3 రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు.. అజ్ఞాతంలోనే ధనుంజయ్ రెడ్డిధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్ప
హైకోర్టులో ముందస్తు బెయిల్పై విచారణ 13న
దీంతో నేడు సిట్ ముందుకు రావడం డౌటే
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో బాస్ల కోసం సిట్ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలకమైన ముగ్గురి కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మాజీ సీఎం జగన్కు బంటుగా వ్యవహరించిన కృష్ణమోహన్రెడ్డి, అప్పటి కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, భారతీ సిమెంట్స్ ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ఆడిటర్ బాలాజీ గోవిందప్ప కోసం ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో వెతుకుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడ దాక్కున్నారనే విషయంపై సమాచారం సేకరిస్తున్నారు. రూ.3వేల కోట్లకు పైగా జరిగిన ఈ మద్యం కుంభకోణంలో ఈ ముగ్గురినీ ఆదివారం విచారణకు రమ్మని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్లో వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం నోటీసులు అందజేశారు. ఈ కుంభకోణంలో కింగ్ పిన్గా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి అన్ని స్థాయిల్లోనూ వీరు చర్చలుజరిపారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి(ఏ-31), జగన్ ఓఎ్సడీ కృష్ణమోహన్ రెడ్డి(ఏ-32), ఆడిటర్ బాలాజీ గోవిందప్ప(ఏ-33)ను నిందితుల జాబితాలో చేర్చారు.
దీంతో అప్రమత్తమైన ముగ్గురూ మొదట హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే, వారికి ఆయా కోర్టుల్లో ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో సిట్ అధికారులు ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే అనుమానంతో మరోసారి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నెల 13న హైకోర్టులో పిటిషన్పై విచారణ ఉన్నందున 11న సిట్ ముందుకు వస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి కోసం గాలిస్తున్న సిట్ అధికారులు శనివారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వనస్థలిపురంలోని నారాయణరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లారు. అదేవిధంగా బంజారా హిల్స్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. పంజాగుట్టలోని ధనుంజయ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఇంట్లో ఉన్నారా.? అని ఆరా తీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, కడప, బెంగళూరులోనూ లిక్కర్ బాస్ల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు నోరు విప్పితే అంతిమ లబ్ధిదారు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ పెద్దలు ఆ ముగ్గురినీ అజ్ఞాతంలోకి పంపినట్లు సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Updated Date - May 11 , 2025 | 05:07 AM