Dalmia Bharat Cement: జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్ ఆస్తులు జప్తు
ABN, Publish Date - Apr 18 , 2025 | 03:46 AM
జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా భారత్ సిమెంటు కంపెనీకి చెందిన రూ.793.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ఈడీ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
వాటి విలువ రూ.793 కోట్లు: ఈడీ
రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉండగా..
భారతీ సిమెంట్స్లో అడ్డగోలుగా పెట్టుబడి
రూ.94 షేరు 1,441కి కొనుగోలు
అలా 2 లక్షల షేర్లు కొన్న దాల్మియా
దీని వెనుక మనీలాండరింగ్ ఉందన్న సీబీఐ
అవే అభియోగాలతో ఈడీ తాజా చర్య
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా భారత్ సిమెంట్ లిమిటెడ్ (డీబీసీఎల్)కు చెందిన రూ.793.34 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. హైదరాబాద్లో ఉన్న డీబీసీఎల్ భూమిని ప్రొవిజనల్ ఎటాచ్మెంట్ చేశామని, గతంలో ఆ కంపెనీ రూ.377.26 కోట్లతో ఆ భూమిని కొనుగోలు చేసిందని ఈడీ వెల్లడించింది. జగన్మోహన్రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులపై 2011లో సీబీఐ కేసు నమోదు చేసిందని, ఆ కేసు ఆధారంగా డీబీసీఎల్ ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చామని తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా మనీలాండరింగ్ చట్టాన్ని (2002) ఆ కంపెనీ ఉల్లంఘించినట్లు పేర్కొంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార పలుకుబడిని ఉపయోగించి ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి భారతీ సిమెంట్స్కు భారీ ఎత్తున ఈక్విటీని, రుణాలను సమీకరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. భారతీ సిమెంట్స్ ఈక్విటీ షేర్లు ఐదున్నర కోట్లున్నాయి. రూ.10 ముఖ విలువకే నాలుగున్నర కోట్ల వాటాలను జగన్, ఆయన కంపెనీలు తీసుకోగా..
మిగతా షేర్లను దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ వంటి వ్యాపార ప్రముఖులు ఒక్కో షేరుకు రూ.94 నుంచి రూ.175 రేటుతో కొనుగోలు చేయడం గమనార్హం. దాల్మియా సిమెంట్స్ ఆ తర్వాత 2 లక్షల షేర్లను రూ.1,440 రేటుతో కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని సీబీఐ గతంలో వెల్లడించింది. తాజాగా ఈడీ అవే అభియోగాలతో డీబీసీఎల్ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
న్యాయపరంగా ఎదుర్కొంటాం: డీబీసీఎల్
తమకు చెందిన రూ.793.34 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తుపై ఈడీ గత నెల 31న ఉత్తర్వులిచ్చిందని.. ఆ ప్రతిని ఈ నెల 15వ తేదీన తాము అందుకున్నామని డీబీసీఎల్ బుధవారం ప్రకటించింది. ఇది తాత్కాలిక జప్తు మాత్రమేనని.. దీనివల్ల తమ కంపెనీ కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకులూ ఉండవని, యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఈడీ ఆదేశాలను న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది.
ఉత్పత్తి ప్రారంభించకుండానే ప్రతిఫలం
2007లో భారతీ సిమెంట్స్ పెట్టిన జగన్.. 2009 ఆగస్టు 27న తన వాటా నుంచి 2,27,584 షేర్లను ఒక్కొక్కటీ రూ.1,450 ధరకు మ్యాట్రిక్స్ ప్రసాద్కు చెందిన అల్ఫావిల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు విక్రయించారు. జగన్కు రూ.33 కోట్లు దక్కాయి. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ప్రారంభించక ముందే ఆయనకు భారీ ప్రతిఫలం దక్కిందన్న మాట. ఈ మొత్తంతో ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసింది. విక్రయించిన ఈ షేర్లు జగన్ వాటాలో ఒక శాతం కంటే తక్కువే. ఆయన తండ్రి అధికార పగ్గాలు చేపట్టాక భారతీ సిమెంట్స్లోకి అక్రమ పెట్టుబడులు రప్పించే దందాసాగింది. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి.రాజగోపాల్ పక్కా స్కెచ్తో సాగిన అడ్డగోలు దోపిడీ బాగోతం అప్పట్లో విమర్శలకు కేంద్ర బిందువైంది. వైఎస్ కుటుంబం తమకు సన్నిహితంగా ఉండే సజ్జల కుటుంబాన్ని వినియోగించుకుని సాగించిన అక్రమాలు బయటకు వచ్చాయి. అప్పటి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎ.దయాకర్రెడ్డి, సూపరింటెండెంట్ కె.వెంకట్రావు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలతో.. ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది. కడప జిల్లా నవాబుపేట తాలమంచిపట్నంలో 1,017 ఎకరాల సున్నపురాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్ లీజుకోసం 1997లో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. నాటి గనుల శాఖ జేడీ మేనకేతన్ రెడ్డి ఈ సంస్థకు సిమెంట్ ప్లాంటు ఏర్పాటు చేసే అర్హత లేదని స్పష్టంచేశారు. దరఖాస్తుదారుడి వివరణ కోరారు. కానీ స్పందన లేదు. 2004లో రాజశేఖర్రెడ్డి గద్దెనెక్కాక ఈ ఫైలు ఒక్కసారిగా కదిలింది. ఇదే సంస్థ నుంచి మరో దరఖాస్తును స్వీకరించారు. ఎన్నో ఏళ్లు స్పందించని కంపెనీకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సు మంజూరు చేసేలా రాజగోపాల్ ప్రతిపాదనలు పంపారు. దరఖాస్తు చేసిన జయా మినరల్స్కు కాకుండా ఈశ్వర్ సిమెంట్స్కు లీజు బదిలీ చేయాలని షరతు విధించడం గమనార్హం. తర్వాత ఇవి ఈశ్వర్ నుంచి రఘురామ్కు, దాని పేరు మారాక భారతీ సిమెంట్స్కు బదిలీ అయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News
Updated Date - Apr 18 , 2025 | 03:46 AM