AP Government: జూన్ నుంచి రేషన్లో కందిపప్పు, రాగులు
ABN, Publish Date - Apr 27 , 2025 | 02:30 AM
జూన్ నుండి రేషన్లో కందిపప్పు సబ్సిడీపై, రాగులు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 1.46 కోట్ల రేషన్కార్డుదారులకు రూ.600 కోట్ల విలువైన సరుకులు సేకరణకు టెండర్లు పూర్తి చేశారు
అమరావతి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కంది పప్పుతో పాటు తృణధాన్యాలను అందించాలని నిర్ణయించింది. వచ్చే జూన్ నెల నుంచి రేషన్ సరుకులతోపాటు సబ్సిడీపై కిలో కందిపప్పు, ఉచితంగా రాగులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 1.46 కోట్లకు పైగా ఉన్న రేషన్కార్డుదారులకు మూడు నెలలకు సరిపడేలా కందిపుప్పు, ఏడాదికి సరిపడా రాగుల సేకరణ కోసం పౌరసరఫరాల సంస్థ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. రేషన్కార్డుదారులతోపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు, 43,860 టన్నుల ఐఎ్సఎస్ గ్రేడ్ పంచదార (జూన్ నుంచి నవంబరు వరకు సరిపడేలా) సేకరణకు ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో ఎన్ఈఎంఏల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియ ముగియడంతో నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు రవాణా చేయనున్నారు. రాగులను క్వింటాళ్ల లెక్కన గోనెసంచుల్లో రవాణా చేయనున్నారు.
Updated Date - Apr 27 , 2025 | 02:31 AM