Hyderabad: హైదరాబాద్ పరిధిలో 35 ఆర్థిక మండళ్లు
ABN, Publish Date - Jul 10 , 2025 | 04:13 AM
తెలంగాణ రాష్ట్రాన్ని 2036 కల్లా లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ సర్కారు.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధిపై దృష్టి సారించింది.
ఉపాధికి నిలయంగా మహానగరం
ప్రస్తుతం 10 ఆర్థిక మండళ్లు.. కొత్తగా మరో 25
ఈడీపీ-2050లో ప్రతిపాదనలు
విద్య, రవాణా, ఐటీ, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం
హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్లో ఈ ప్రణాళికే అత్యంత కీలకం!
హైదరాబాద్ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని 2036 కల్లా లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ సర్కారు.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధిపై దృష్టి సారించింది. ఆ మేరకు కీలక ప్రతిపాదనలను సిద్ధంచేసింది. అంచెలంచెలుగా.. 2050 వరకు ఆర్థికాభివృద్ధితోపాటు ఉపాధి కల్పనకు ఎకనమిక్ డెవల్పమెంట్ ప్లాన్(ఈడీపీ)-2050ని రూపొందించింది. రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధికి రాబోతున్న సరికొత్త మాస్టర్ప్లాన్-2050లో ఈడీపీ-2050 అత్యంత కీలకం కానుంది. హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం పది ఆర్థిక మండళ్లు(ఎకనమిక్ నోడ్స్) ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిని విస్తరించిన నేపథ్యంలో.. కొత్తగా మరో 25 ఆర్థిక మండళ్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటి వల్ల ఆర్థికాభివృద్ధితోపాటు ఉపాధి గణనీయంగా పెరుగుతుంది. ఓ కన్సల్టెన్సీ ద్వారా రెండేళ్లకు పైగా కసరత్తు చేసి, హెచ్ఎండీఏ పరిధిలో ఆర్థిక మండళ్ల సంఖ్యను 35కు పెంచింది. ఈడీపీ-2050లో ఈ వివరాలను పొందుపరిచింది. అంతేకాదు.. రియల్ఎస్టేట్, నిర్మాణరంగం, పారిశ్రామిక రంగంపై ఈడీపీని పలు రంగాల ప్రముఖుల ముందు పెట్టగా.. వారు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
హైదరాబాద్, కొత్తూరు, మేడ్చల్, ఘట్కేసర్, అంబర్పేట ప్రాంతాలు వాణిజ్యపరంగా.. సైబరాబాద్, జవహర్నగర్ ప్రాంతాలు ఐటీ/ఐటీ ఆధారితం కాగా, పటాన్చెరు, ఉప్పల్ ఏరియాలు పారిశ్రామిక వాడలుగా.. శంషాబాద్ రవాణాపరంగా ఆర్థిక మండళ్లుగా కొనసాగుతున్నాయి. ఈడీపీ-2050లో అదనంగా విద్య, మిశ్రమ వినియోగం, రవాణా, పర్యాటక రంగాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో.. పారిశ్రామిక ఆర్థిక మండళ్లుగా పటాన్చెరు, రుద్రారం, తూప్రాన్, శామీర్పేట, దండుమల్కాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, చందన్వల్లి, తుర్కపల్లి, నారాయణపూర్, యాచారం, మంచాల్, అమన్గల్, మిశ్రమ ఆర్థిక మండళ్లుగా హైదరాబాద్, సైబరాబాద్, ఉప్పల్, శంషాబాద్, కొత్తూరు, మేడ్చల్, ఘట్కేసర్, ఆదిభట్ల, ఫ్యాబ్సిటీ, ముచ్చర్ల, షాద్నగర్ ఉంటాయి. మిశ్రమంలోనే ఐటీ, ఐటీఈఎస్, వాణిజ్య సేవలు, ఇతర రంగాలుంటాయి. విద్యాపరమైన ఆర్థిక మండలిగా జవహర్నగర్, పర్యాటకానికి సంబంధించి అంబర్పేట, నర్సాపూర్, మర్కూర్, భువనగిరి, మృగవని, లాజిస్టిక్ ఆర్థిక మండళ్లుగా కండ్లకోయ, నాగిరెడ్డిపల్లి, బాటసింగారం, ఈదులనాగులపల్లి, రావులపల్లి ఉంటాయి. ఇలా.. మొత్తం 35 ఆర్థిక మండళ్లను ప్రభుత్వం పరిచయం చేసింది. ఈ మండళ్లు ఉపాధి లక్ష్యం గా ఉంటాయి. మెరుగైన పట్టణాభివృద్ధి, ఉపాధితోపాటు.. వివిధ రంగాలకు సమప్రాధాన్యం ఉంటుంది.
మాస్టర్ప్లాన్-2050కి అనుగుణంగా
దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ మహా నగరం నిలుస్తుండగా.. మాస్టర్ప్లాన్-2050లో కూడా అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. న్యూయార్క్, సియోల్ వంటి నగరాలు సాధించిన విజయాలను అనుసరించడం ద్వారా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే హెచ్ఎండీఏ ప్రాంతంలో ఇప్పటికే ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మెట్రోరైలు విస్తరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, మూసీ నదీ తీరం పునరాభివృద్థి వంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో హెచ్ఎండీఏ ప్రాంతం కీలకపాత్ర పోషించడానికి ఈడీపీ-2050ని తీసుకొచ్చింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో హెచ్ఎండీఏ ఏరియా నుంచి 50ు వాటాతోపాటు 2050 వరకు జీడీపీ 123లక్షల కోట్లకు చేరుతుందని, హెచ్ఎండీఏ ఏరియాలో ప్రస్తుతం 55 లక్షల మంది వరకు ఉపాధి కల్పిస్తుండగా.. 2050 వరకు 1.41కోట్లకు చేరుతుందని ఈ ప్లాన్లో అంచనా వేశారు.
ఈడీపీ-2050లో ప్రతిపాదనలు
హెచ్ఎండీఏ పరిధిలో ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అన్ని రంగాలకు అనుకూలమైన విధానం, మౌలిక సదుపాయాల కల్పనతో సాంప్రదాయ, కొత్తగా వస్తున్న సెక్టార్లకు ప్రాధాన్యమివ్వాలి.
హెచ్ఎండీఏ ప్రాంతానికి ఆర్థిక జియోగ్రఫీ ద్వారా వివిధ ఆర్థిక కేంద్రాలు లేదా ‘మండళ్ల’కు మార్గనిర్దేశాలు చేయాలి.
ప్రతి రంగానికి భౌగోళికంగా భూమి డిమాండ్ను లెక్కించడం, వివిధ రంగాల వారిగా భూ వినియోగ జోన్లో అభివృద్ధి నియంత్రణకు నిబంధనలను రూపొందించాలి.
ప్రతి రంగానికి స్థల పంపిణీ తప్పనిసరి.
ప్రస్తుతం ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, లైఫ్ సైన్సె స్, ఏరోస్పేస్, రక్షణ వంటి రంగాలలో బలమైన పోటీతత్వాన్ని కలిగి ఉండగా.. మున్ముందు ఆహార శుద్ధి, ఎలకా్ట్రనిక్స్, ఆస్పత్రులు వంటి రంగాలలో పోటీతత్వాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త రంగాల పరంగా డ్రోన్లలో బలమైన పోటీతత్వాన్ని కలిగి ఉండగా.. మున్ముందు డాటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో సామార్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
ప్రాధాన్య రంగాలలో విద్యా సేవలు, రియల్ఎస్టేట్, హోటళ్లు, లాజిస్టిక్స్ వంటి రంగాలు నైపుణ్యం కలిగిన కార్మికుల డిమాండ్ను తీరుస్తాయి. ఈ రంగాల్లో ఎగుమతులు పెరుగుతాయి.
హెచ్ఎండీఏ పరిధిలో భూమి డిమాండ్ ఇలా..!
భూ వినియోగం 2030 వరకు 2030 - 2050 2024 - 2050
తయారీ రంగం 156.10 కి.మీ 567.70 కి.మీ 723.80 కి.మీ
వాణిజ్య రంగం 9.48 కి.మీ 34.61 కి.మీ 44.09 కి.మీ
ఇవి కూడా చదవండి..
వాట్సాప్లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 04:13 AM