Rajiv Swagruha: వేలానికి వేళాయె!
ABN, Publish Date - May 27 , 2025 | 05:15 AM
రాజీవ్ స్వగృహకు చెందిన పలు ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న టవర్లకు సంబందించిన వివరాలతోపాటు ఎంత ఆదాయం వస్తుందన్న అంశంపై అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
రాజీవ్ స్వగృహ పరిధిలోని ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధం
రూ.3,538కోట్లు వస్తాయని అంచనా
సర్కారు ఆమోదం తర్వాత వేలం
తొలి దశలో 11ప్రాంతాల్లో విక్రయాలు
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ స్వగృహకు చెందిన పలు ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న టవర్లకు సంబందించిన వివరాలతోపాటు ఎంత ఆదాయం వస్తుందన్న అంశంపై అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వేలం ధర ఎంత నిర్ణయించాలన్న అంశంపై గతంలోనే జిల్లాలు, మునిసిపాలిటీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల వారీగా కమిటీలను నియమించారు. ఆయా కమిటీలు ఇచ్చిన ధరల వివరాలను తాజా నివేదికలో పొందుపర్చారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న నివేదికకు ఆమోదం లభించగానే వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం రాజీవ్ స్వగృహ కింద ఉన్న ఆస్తులను వేలం వేస్తే రూ.3,538కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు. ఆయా ఆస్తులను దశల వారీగా వేలం వేయాలని ప్రతిపాదించారు. మొదటి విడతలో మేడ్చల్, ఖమ్మంతోపాటు ఇతర జిల్లాల్లోని 11 ఆస్తులను వేలం వేయడం ద్వారా రూ.850-950కోట్ల వరకు ఆదాయం రావొచ్చని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో పోచారం, బండ్లగూడ టవర్లలోని కొన్ని ఫ్లాట్లు, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మగా.. రూ.2వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. మిగిలిన వాటిని ఇప్పుడు వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు.. అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బండ్లగూడ (సహభావన టౌన్షి్ప)లో 159 ఫ్లాట్లు, పోచారం (సద్భావన)లో 601 ఫ్లాట్లు ఉన్నాయని, వీటిని వేలం వేయడం ద్వారా రూ.128.43కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇదే జిల్లా పరిధిలోని గాజులరామారంలో 5 టవర్లు, పోచారంలో 6, జవహర్నగర్లో 17, ఖమ్మం జిల్లాలో 8 టవర్లు అసంపూర్తిగా ఉన్నాయని, వీటిని వేలం వేస్తే రూ.725.23కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని కుర్మలగూడలో 20, చందానగర్లో 03, తొర్రూరులో 514, కవాడిపల్లిలో 40, మేడ్చల్ జిల్లా పరిధిలోని బహదూర్పల్లిలో 69, మహబూబ్నగర్ జిల్లాలోని పోతులమడుగులో 111, అమిస్తాపూర్లో 45, ఆసిఫాబాద్ జిల్లాలోని బోరేగావ్లో 73, కామారెడ్డిలో 79, నల్గొండ జిల్లా ఎల్లారెడ్డి గూడలో 52, వికారాబాద్ జిల్లా కోకట్లో 10, ఆదిలాబాద్ జిల్లా బట్టిసావర్గావ్లో 9, గద్వాలలో 8, కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్లో 3, మేడ్చల్ జిల్లా గాజులరామారంలో 12చొప్పున ఓపెన్ ప్లాట్లు ఉండగా.. రూ.613.34 కోట్లు వస్తాయని వెల్లడించా. కామారెడ్డిలో 107, నల్లగొండ జిల్లా ఎల్లారెడ్డి గూడలో 200, వికారాబాద్ జిల్లా కోకట్లో 54 చొప్పున నిర్మించతలపెట్టిన ఇళ్లు ఆసంపూర్తిగా మిగిలిపోయాయని, వీటి ద్వారా రూ.38.81కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇవికాకుండా మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్నగర్లో 19 ఎకరాలు, గాజులరామారంలో 5, పేట్బషీరాబాద్లో 18, మల్లంపేటలో 10.50 ఎకరాలు, కామారెడ్డి జిల్లా అడ్లూర్లో 15.20, ఖమ్మం జిల్లా పోలేపల్లిలో 3.38, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కవాడిపల్లిలో 30, తట్టిఅన్నారంలో 35ఎకరాల చొప్పున భూములు ఉండగా.. రూ.492.45కోట్లు వచ్చే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో 83ఎకరాలు(రూ.350కోట్లు), మేడ్చల్ జిల్లా నిజాంపేటలో 16 ఎకరాలు (రూ.225కోట్లు), బోడుప్పల్లో 20ఎకరాలు(రూ.140 కోట్లు) కోర్టు కేసుల్లో ఉన్నాయని, పరిష్కారమయ్యాకే వాటిని విక్రయించే అవకాశం ఉందని తెలిపారు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..
Updated Date - May 27 , 2025 | 05:15 AM