Hyderabad: ఇక్కడ ‘బయోమెట్రిక్’నూ ఫోర్జరీ చేసేశారుగా..
ABN, Publish Date - May 28 , 2025 | 09:51 AM
ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానం అమలులో ఉండగా.. దాన్ని సైదం ఫోర్జరీ చేస్తున్నారు. ఉద్యోగుల హాజరు నమోదు చేసే ఉద్యోగి ఈ తతంగానికి సూత్రధారి అనే ఆరోపణలొస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే...
- విధులకు డుమ్మా...
- అయినా పూర్తి జీతం
- తోటి ఉద్యోగులకూ అటెండెన్స్లో మార్పులు
- జేబులు నింపుకుంటున్న వైనం
- ఉస్మానియా ఆస్పత్రిలో చక్రం తిప్పుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో విధులకు వచ్చే వారి బయోమెట్రిక్ అటెండెన్స్(Biometric attendance)ను పర్యవేక్షించే ఓ ఔట్సోరింగ్ ఉద్యోగి.. తాను విధులకు రాకున్నా వచ్చినట్లుగా మార్పులు చేస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. తనే కాదు.. ఇతర ఉద్యోగులకు కూడా వారి హాజరుశాతాన్ని పెంచుతూ జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ విధానంలో నాలుగు ఏజెన్సీల ద్వారా మొత్తం 210మంది వరకు డీఓలు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, డ్రైవర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరి అటెండెన్స్ మొత్తం సూపరింటెండెంట్ చాంబర్లో పనిచేసే ఓ ఉద్యోగి పర్యవేక్షిస్తుంటాడు. బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ సేకరించి పంపించడం ఇతని బాధ్యత. బయోమెట్రిక్ విధానంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం సదరు ఉద్యోగికి ఉండడంతో తన అవసరాల మేరకు మార్పులు చేస్తూ జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
విధులకు రాకపోయినా..
సదరు ఉద్యోగి తాను విధులకు హాజరు కాకపోయినా బయోమెట్రిక్, హాజరు రిజిస్టర్లో హాజరైనట్లు మార్పులు చేసి జీతం పొందుతున్నాడు. ఈ ఏడాది జనవరి 14 నుంచి 22వరకు కుంభమేళాకు, ఫిబ్రవరి 15 నుంచి 22 వరకు మరో కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆస్పత్రి విధులకు సదరు ఉద్యోగి డుమ్మా కొట్టాడు. ఆ తర్వాతి రోజుల్లో ఆస్పత్రికి రాగానే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు బయోమెట్రిక్లో హాజరు అయినట్లు మార్పులు చేసి చూపించాడు. ఇలా.. తనకే కాకుండా మరి కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గైర్హాజరును కూడా హాజరు అయినట్లు మార్పులు, చేర్పులు చేస్తూ డబ్బు తీసుకున్నట్లు సమాచారం.
సదరు ఉద్యోగి సెలవు రోజుల్లో కూడా పూర్తి జీతాలను పొందినట్లు తెలుసుకున్న తోటి ఉద్యోగులు అందుకు సంబంధించిన వివరాలను వివరిస్తూ ఓ ఫిర్యాదును ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంఈలకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారు. అయితే, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులే ఫిర్యాదు పత్రాలు డీఎంఈకి చేరకుండా సెక్షన్ కార్యాలయంలో ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బయోమెట్రిక్లో మార్పులు చేస్తున్న ఉద్యోగికి మద్దతుగా ఉంటున్న ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
విచారణ జరుపుతున్నాం..
బయోమెట్రిక్ అటెండెన్స్లో మార్పులు, చేర్పులు చేసినట్లు ఫిర్యాదుతో పాటు అటెండెన్స్ రిజిస్టర్ కాపీలు వచ్చిన విషయం వాస్తవమే. కానీ, సదరు పత్రాల్లో ఫిర్యాదుదారుల పేర్లు రాయలేదు. అయినప్పటికీ వాటిపై విచారణ జరిపిస్తున్నాం. బయోమెట్రిక్లో తప్పులు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
- సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..
Miss World 2025: మిస్ వరల్డ్ ఫైనల్స్... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు
Read Latest Telangana News and National News
Updated Date - May 28 , 2025 | 10:09 AM