Medical Colleges: ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ షోకాజ్లు!
ABN, Publish Date - Jun 18 , 2025 | 03:57 AM
తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఇంచుమించు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని అన్ని కళాశాలలకూ జారీ
దక్షిణాది రాష్ట్రాల్లోని 98 శాతం కాలేజీలకు...
ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో తెలంగాణలో
9 కాలేజీలకు ఇచ్చిన నోటీసుల ఉపసంహరణ
మిగతా 25 కళాశాలలకు సంబంధించి హామీ ఇచ్చేందుకు ఎన్ఎంసీ ముందుకు అధికారులు
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఇంచుమించు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో గాంధీ, ఉస్మానియాతో సహా మొత్తం 34 కాలేజీలకూ నోటీసులు ఇచ్చింది. ఎన్ఎంసీ నిబంధనల మేరకు సౌకర్యాలు లేని కాలేజీలకు నోటీసులు ఇస్తుంటుంది. ప్రతీ ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో ఇది పరిపాటిగా మారింది. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 120 ప్రభుత్వ వైద్య కళాశాలలకు 118కి (98 శాతం) నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే అన్నింటికీ, ఉత్తరప్రదేశ్లో 46కు 24, గుజరాత్లో 23కు 10, మధ్యప్రదేశ్లో 17కు గాను నాలుగింటికి నోటీసులు ఇచ్చినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. మిగతా రాష్ట్రాల సంగతి తెలియాల్సి ఉంది. వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత, ల్యాబొరేటరీల పనితీరు బాగోకపోవడం, రేడియాలజీ మిషన్లు (సిటీ, ఎంఆర్ఐ) లేకపోవడం, పడకలు, బోధనాస్పత్రుల్లోని శస్త్రచిక్సితలు, రోగుల సంఖ్య, పడకలు తగినన్ని ఉండకపోవడం తదితర కారణాలతో ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
నోటీసుల్లో పేర్కొన్న లోపాలను సరిదిద్దుకునేందుకు కాలేజీలకు అవకాశం కల్పించింది. తెలంగాణ వైద్య శాఖ ఇచ్చిన వివరణతో 9 కాలేజీలకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకుంది. మిగతా వాటికి కూడా ప్రభుత్వం ఇచ్చే రాతపూర్వక హామీతో నోటీసులు ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, డీఎంఈ డాక్టర్ నరేందర్ కుమార్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్ఎంసీ ముందు హాజరై మిగతా కాలేజీలకు సంబంధించి రాతపూర్వక హామీ ఇవ్వనున్నారు. దీంతో ఒక్క ఎంబీబీఎస్ సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉండదని ఎన్ఎంసీ అధికారులు హామీ ఇచ్చినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. నాలుగేళ్లుగా వివిధ రాష్ట్రాల్లోని కాలేజీలకు నోటీసులు వస్తూనే ఉన్నాయని, కానీ నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్టు... తెలంగాణలోని కాలేజీలకు మాత్రమే వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ‘ఒకేసారి ఎక్కువ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల ఫ్యాకల్టీ కొరత, మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు వచ్చాయి. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంద’ని తెలిపారు.
Updated Date - Jun 18 , 2025 | 03:57 AM