కొందరిది అడవి బాట.. మరికొందరిది గెలుపుబాట
ABN, Publish Date - May 23 , 2025 | 06:03 AM
వరంగల్ ఆర్ఈసీ... దేశ, విదేశాల్లోని అనేక ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా పని చేసిన తెలుగు ఇంజనీరింగ్ నిపుణులను అందించిన ఘనత ఈ విద్యా సంస్థకు దక్కుతుంది. మరోవైపు పీపుల్స్వార్ గ్రూప్లో అనేక మంది సమర్థులైన నాయకులు కూడా ఇదే సంస్థ నుంచి వచ్చారు.
వేర్వేరుదారుల్లో వరంగల్ ఆర్ఈసీ పూర్వ విద్యార్థులు
పీపుల్స్ వార్ గ్రూప్లో అనేక మంది నాయకులు ఈ సంస్థ నుంచే..
నంబాల కేశవరావు ఇంజనీరింగ్ చదివింది ఇక్కడే
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: వరంగల్ ఆర్ఈసీ... దేశ, విదేశాల్లోని అనేక ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా పని చేసిన తెలుగు ఇంజనీరింగ్ నిపుణులను అందించిన ఘనత ఈ విద్యా సంస్థకు దక్కుతుంది. మరోవైపు పీపుల్స్వార్ గ్రూప్లో అనేక మంది సమర్థులైన నాయకులు కూడా ఇదే సంస్థ నుంచి వచ్చారు. అయితే వీరిలో బుధవారం ఛత్తీ్సగఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రముఖుడు. హనుమకొండలో ప్రస్తుతం ఎన్ఐటీగా ఉన్న ప్రఖ్యాత ఇంజనీరింగ్ విద్యా సంస్థ ఆర్ఈసీగా నాడు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ సంస్థ నుంచి ఉత్తీర్ణులైన అత్యధికులు దేశ, విదేశాల్లో గౌరవప్రదమైన ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ కళాశాల విద్యార్థి అయిన కావూరి సాంబశివరావు దేశ, విదేశాల్లో కాంట్రాక్టులు చేపట్టడమేకాకుండా కేంద్ర మంత్రి కూడా అయ్యారు.
మరోవైపు విప్లవం వర్ధిల్లాలి అంటూ నినదిస్తూ అడవిబాట పట్టి అమరులైన అనేకులు కూడా ఇందులో విద్యనభ్యసించారు. పీపుల్స్వార్కు ప్రాణం పోసిన రాడికల్ విద్యార్థి సంఘానికి ఈ కాలేజీ కేంద్ర బిందువుగా ఉండేది. నంబాల కేశవరావు, ఇతర రాడికల్ విద్యార్థి సంఘం నాయకుల గురించి తాము చాలా విన్నామని, విద్యార్థి సంఘం ఎన్నికల సందర్భంగా ఏబీవీపీ, ఆర్ఎ్సయూ గొడవలు ఆ కాలంలో సహజమని 1970ల్లో అందులో ఇంజనీరింగ్ చేసి.. ప్రస్తుతం గల్ఫ్లో ఉంటున్న ఓ ఇంజనీరింగ్ ప్రముఖుడు చెప్పారు. హాస్టళ్లో నక్సలైట్ల కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్న ఆ కాలంలో తన తండ్రి తనకు బయట నివాసం ఏర్పాటు చేయడంతో సుబేదారిలో ఉండి చదువుకున్న తర్వాత తాను విదేశాలకు వచ్చానని చెప్పారు. పలు ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల్లో పని చేసిన ఆయన ప్రస్తుతం సొంత వ్యాపారం చేస్తున్నారు.
Updated Date - May 23 , 2025 | 06:03 AM