గాలి, వాన బీభత్సం
ABN, Publish Date - May 10 , 2025 | 11:23 PM
పెద్దపల్లి, ధర్మారం, పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, పాలకుర్తి తదితర మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఒక్కసారిగా వర్షం పడడంతో ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయి మురికి కాలువలోకి చేరాయి. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్కు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
పెద్దపల్లి, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాలో నాలుగు గంటల వరకు అంతరాయం ఏర్ప డింది. పెద్దపల్లి, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లో వర్షం కురిసింది. పెద్దపల్లిలో 15.3 మిల్లీ మీటర్లు, ధర్మారం మండలంలో 1.8 మిల్లీమీటర్లు, పాలకుర్తి, అంతర్గాం మండలంలో 2.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి పెద్దపల్లి, ధర్మారం మార్కెట్ యార్డుల్లో ధాన్యం కుప్పలు తడిసాయి. అప్పటికే పరిస్థితిని గమనించిన కొందరు రైతులు టార్ఫాలిన్లు ధాన్యం కుప్పలపై కప్పారు. కొందరు రైతులకు టార్ఫాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసింది. పెద్దపల్లి మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని చైర్పర్సన్ ఈర్ల స్వరూప ధాన్యాన్ని పరిశీలించారు. ధర్మారం మార్కెట్ యార్డును ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. భారీ గాలులకు పెద్దపల్లి మార్కెట్ యార్డులో అనేక చెట్లు విరిగిపడ్డాయి. ధర్మారం మండలంలో వివిధ రహదారుల వెంబడి ఉన్న చెట్ల కొమ్మలు విరిగిపడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అకాల వర్షానికి పెద్దపల్లి, ధర్మారం, తదితర మండలాల్లో నాలుగు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ధాన్యం తడిసి పోయి నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఒక్కసారిగా వర్షం పడడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల కేంద్రంతోపాటు మేడారం, కొత్తపల్లి గ్రామాలలో భారీ వర్షం పడడంతో కొను గోలు కేంద్రాలలోని ఽధాన్యం కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాలి, వానతో రైతులు ధాన్యంపై కప్పిన కవర్లు కొట్టుకుపోయి వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయి పక్కనే ఉన్న మురికి కాలు వలోకి చేరాయి. వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. శనివారం సాయత్రం 4 గంటలకు మర్కెట్ సిబ్బంది తేమ చూస్తామని చెప్పారని, అదే సమయా నికి భారీ వర్షంతో వడ్లు పూర్తిగా తడిచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటపాటు భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో అకాశం అలజడి సృష్టించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈదురుగాలులకు తహసీల్దార్ కార్యాలయం సమీ పంలో భారీ వృక్షం నడి రోడ్డుపై పడింది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. యోగా గురువు సుధాకర్ చెట్టుకొమ్మలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా సహాయ సహకారాలు అందించారు. ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసులు ఎక్స్కావేటర్తో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. బస్టాండ్ సమీపంలో భారీ హోర్డింగ్ నేల కూ లింది. మొత్తానికి ఓ గంటపాటు ఉరుములు మెరుపు లతో గాలి వాన అలజడి సృష్టించడంతో ఏం జరుగు తుందో అర్ధం కాక జనం ఆందోళనకు గురయ్యారు.
తడిసిన ధాన్యాన్ని కొనిపించే బాధ్యత నాది
అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యాన్ని రైతులకు ఎలాంటి కటింగ్లు లేకుండా కొనిపించే బాధ్యత తనదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఆయన తడిసిన ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లా నాయక్తో కలిసి ధర్మారం మార్కెట్లో పరిశీలించారు. ధాన్యం తడిసిం దని రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతీ గింజను రైతుకు నష్టం లేకుండా కొనిపిస్తానని భరోసా కల్పించారు. డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ రాజేందర్, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్లతో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం మార్కెట్ను సందర్శించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏఎంసీ వైస్ చైర్మెన్ అరిగె లింగయ్య, ఏఎంసీ డైరెక్టర్లు ఈదుల శ్రీనివాస్, కాంపెల్లి రాజేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కాడె సూర్యనారాయణ, కొత్త నర్సిం హులు, దేవి జనార్దన్, పాలకుర్తి రాజేశం, ఎండీ బాబ, పొన్నవేని స్వామి, ఓరెం చిరంజీవి తదితరులు ఉన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్తోపాటు పలు గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో ఆరబోసి ఉన్న ధాన్యాన్ని రైతులు కవర్లు కప్పి తడవకుండ కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంత ధాన్యం తడిసింది. సుల్తానాబాద్తో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కనగర్తి, బొంపల్లి, కాసుల పల్లి, అప్పన్నపేట, అందుగులపల్లి, పెద్దబొంకూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షానికి స్వలంగా తడిసింది. ముందుగానే టార్ఫా లిన్లు కప్పినా కొంతమేరకు ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - May 10 , 2025 | 11:23 PM