దేశంలో సన్నబియ్యం ఇచ్చే రాష్ట్రం తెలంగాణే
ABN, Publish Date - Jul 12 , 2025 | 11:59 PM
రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం మంగపేట, కునారం, గంగారం, పందిల్ల గ్రామాల్లో సీసీ రోడ్లు, పాఠశాలల ప్రహరీ నిర్మాణాలను ప్రారంభించి, ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోశారు. అనంతరం కునారం, గంగారం గ్రామాల్లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
కాల్వశ్రీరాంపూర్, జూలై 12(ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం మంగపేట, కునారం, గంగారం, పందిల్ల గ్రామాల్లో సీసీ రోడ్లు, పాఠశాలల ప్రహరీ నిర్మాణాలను ప్రారంభించి, ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోశారు. అనంతరం కునారం, గంగారం గ్రామాల్లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ కాంగ్రెస్పార్టీ ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో కాలంలో ఎలాంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు.
రైతులకు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, కరెంటు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. మంగపేటలో లిఫ్ట్ మంజూరు చేయించి సాగునీటికి ఇబ్బంది రానీయమన్నారు. కూనారం జాఫర్ఖాన్పేట రోడ్డు, కూనారం పెద్దరాత్పల్లి బీటీ రోడ్డు, జగదాంబ ఓర్రెపై బ్రిడ్జి, గంగారం నుంచి పందిల్ల వరకు డబుల్ రోడ్డుతోపాటు పలు పనులకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఈ నెల 14 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. సంక్రాంతి లోగా పెద్దపల్లిలో బస్డిపో ఏర్పాటు చేసి ప్రతీ గ్రామానికి బస్సు నడిచేలా చేస్తామన్నారు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గాజవేన సదయ్య, మాజీ సర్పంచ్ డొంకెన మొగిలి, ఎంపీడీఓ పూర్ణ చందర్రావు, హౌసింగ్ డీఈ పరమాచారి, ఏఈ వసంత, ఎంపీఓ ఆరీఫ్, మాజీ కోఆప్షన్ సజ్జు, పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 11:59 PM