క్వాలిటీ ఏజెన్సీ కమీషన్ల కక్కుర్తి
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:32 AM
రామగుండం నగర పాలక సంస్థలో అభివృద్ధి పనుల్లో నాణ్యత పరిశీలించేందుకు కార్పొరేషన్ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏర్పాటు చేసుకొంది. అభివృద్ధి పనుల్లో నాణ్యతను పరిశీలించేం దుకు అంచనాలపై ఒక శాతం రేటుతో ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే కాగితాలు, బిల్లులకే పరిమితమైంది.
కోల్సిటీ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): రామగుండం నగర పాలక సంస్థలో అభివృద్ధి పనుల్లో నాణ్యత పరిశీలించేందుకు కార్పొరేషన్ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏర్పాటు చేసుకొంది. అభివృద్ధి పనుల్లో నాణ్యతను పరిశీలించేం దుకు అంచనాలపై ఒక శాతం రేటుతో ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే కాగితాలు, బిల్లులకే పరిమితమైంది. కోర్ కంటింగ్కు, క్వాలిటీ సర్టిఫికెట్కు కమీషన్ తీసుకుని నాణ్యత లేకుండానే సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు కాంట్రాక్టర్లే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇటు కాంట్రాక్టర్ల వద్ద, అటు కార్పొరేషన్ వద్ద బిల్లులు వసూలు చేసుకుంటున్న థర్డ్ పార్టీ ఏజెన్సీ నాణ్యత విషయంలో కాగితాలకే పరిమితమైంది. దీంతో కాంట్రాక్టర్లది ఆడిందే ఆటగా సాగుతోంది.
రామగుండం నగరపాలక సంస్థలో 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి, ఎస్డీఎఫ్, ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన సీఎస్ఆర్ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గ్రాంట్లకు సంబంధించి అభివృద్ధి పనుల్లో నాణ్యత పరిశీలించేందుకు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ను నియమించారు. రెండేళ్ల కాలపరిమితిపై ఒక ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ రామగుండంలో నాణ్యత పరీక్షలకు ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. సంబంధిత ఏజెన్సీ సాంకేతిక సిబ్బంది అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపాలి. మెటీరియల్ను పరిశీలించి అంగీకరించిన తరువాతే కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టాలి. ఏ రోజుకు ఆ రోజు ‘టిబ్స్’ తీసి 21రోజుల తరువాత రోజువారి టిబ్స్ను పరిశీలించాల్సి ఉంటుంది. సీసీ రోడ్లు పూర్తయిన తరువాత కోర్ కంటింగ్ చేసి స్ర్టెంత్ చెక్ చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సర్టిఫై చేసిన పరిశ్రమలకు వెళ్లి కాంట్రాక్టర్లు కొనుగోలు చేసే పైపుల నాణ్యతను పరిశీలించాలి. కాంక్రీటు, సిమెంట్ మిశ్రమంలో ఎప్పటికప్పుడు పరీక్షించాల్సి ఉంటుంది. మంచినీటి పైప్లైన్లకు సంబంధించి కూడా పరిశ్రమలకు వెళ్లి పరిశీలించాలి. తరువాత వీరిచ్చే రిపోర్టు ఆధారంగా బిల్లుల చెల్లింపులు ఉంటాయి. ఈ నిబంధనలు ఏవీ రామగుండంలో పాటించడం లేదు. క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీకి సంబంధించిన ల్యాబ్ ఏర్పాటు చేయలేదు. పనులపైకి పరిశీలకు కూడా సంబంధిత ఏజెన్సీ సిబ్బంది వచ్చిన దాఖలాలు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు పరిశీలించకపోవడంతో నాణ్యత లేని పైపులను కాంట్రాక్టర్లు గుర్తింపు లేని పరిశ్రమల నుంచి తెచ్చి వేస్తుండడంతో అవి కొన్నాళ్లకే శిథిలమవుతున్నాయి. ఇతర అభివృద్ధి పనుల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
కాంట్రాక్టర్లు, కార్పొరేషన్ల వద్ద వసూళ్లు...
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అనేది సర్టిఫికెట్లకు జారీ చేసే వ్యవస్థగా మారింది. పనులు జరుగుతున్న సమయంలో పరిశీలించకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కోర్ కటింగ్కు రూ.1500, క్వాలిటీ సర్టిఫికెట్కు బిల్లుపై కాంట్రాక్టర్ వద్ద 0.5శాతం వసూలు చేస్తున్నారు. అదనంగా నగరపాలక సంస్థ వద్ద ఈసీవీపై 0.9శాతం థర్డ్ పార్టీ పేర బిల్లులు ఇస్తున్నారు.
ఇష్టానుసారంగా లెస్ టెండర్లు
రామగుండం నగర పాలక సంస్థలో అభివృద్ధి పనుల నాణ్యతపై థర్డ్ పార్టీ ఏజెన్సీ పరిశీలన చేయకపోవడంతో కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లలో ఇష్టానుసారంగా లెస్పై టెండర్లు వేస్తున్నారు. అంచనాలపై 30శాతం నుంచి 40శాతం కోడ్ చేస్తున్నారు. అధికారులు, థర్డ్ పార్టీ ఏజెన్సీ సహకారంతోనే నాణ్యత లేకుండా పనులు కొనసాగుతుండడంతోనే కాంట్రాక్టర్లు లెస్లపై టెండర్లు దాఖలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రామగుండంలో గతంలో డీఎఫ్ఐడీ ఇతర స్కీముల పనులు జరిగిన సమయంలో థర్డ్ పార్టీ ఏజెన్సీ సిబ్బంది క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేసేవారు. నాణ్యత విషయంలో రాజీపడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి.
Updated Date - Jun 22 , 2025 | 12:32 AM