Hyderabad: కరెంటు.. సీసీటీవీలు లేని గోదాంలో 8.5 కోట్లు
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:01 AM
ఆ గోదాంలో కరెంటు లేదు.. సీసీటీవీలు లేవు.. అయినా, అందులో ఏకంగా రూ.8.5కోట్లకుపైగా నగదు నిల్వ ఉంది. ఆ డబ్బును ఎత్తుకెళ్లినా పట్టించుకునే నాథుడు లేడు.
ఏటీఎంలలో జమ చేయాల్సిన డబ్బు
సెక్యూరిటీ సంస్థ గోదాంలో పర్యవేక్షణ లేకుండా పడి ఉన్న వైనం
సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవటంతో రెండు నెలలుగా విధులకు దూరం
బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో వెలుగులోకి.. హైదరాబాద్లో ఘటన
బోయిన్పల్లి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ఆ గోదాంలో కరెంటు లేదు.. సీసీటీవీలు లేవు.. అయినా, అందులో ఏకంగా రూ.8.5కోట్లకుపైగా నగదు నిల్వ ఉంది. ఆ డబ్బును ఎత్తుకెళ్లినా పట్టించుకునే నాథుడు లేడు. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీ-సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన గోదాం అది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఎస్ బ్యాంకు, ధనలక్ష్మి, కోటక్ తదితర బ్యాంకులకు చెందిన 107 ఏటీఎంలలో ఈ సెక్యూరిటీ సంస్థలు డబ్బులు డిపాజిట్ చేస్తుంటాయి. అయితే, కొన్ని రోజులుగా ఏటీఎంలలో డబ్బులు జమ కాకపోవడంతో ఆయా బ్యాంకుల అధికారులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయటంతో.. గోదాంలో దిక్కు లేకుండా పడి ఉన్న రూ.8.52కోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు గోదాంను పరిశీలించారు. నగదు అక్కడే ఉండటంతో బ్యాంకు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కనీసం కరెంటు, సీసీటీవీల నిఘా, భద్రత ఏర్పాట్లు లేకుండా రెండు నెలలుగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు నిల్వ చేయడంపై పోలీసులు సదరు సెక్యూరిటీ సంస్థపై అసహనం వ్యక్తం చేశారు. ఆ సెక్యూరిటీ సంస్థలో పనిచేసే సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు చెల్లించటం లేదని, దీంతో వారు రెండు నెలలుగా రావటం విధులు మానేశారని వెల్లడైంది. ఫలితంగా, ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ.8.52 కోట్లు గోదాంలోనే ఉండిపోయాయి. ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం ముంబైలో ఉందని, తాము అక్కడికి వెళ్లి కలిసినప్పటికీ వారు స్పందించడంలేదని ఏజెన్సీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోర్టు ద్వారా నోటీసులు పంపినప్పటికీ ఏమీ జరగలేదని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటీ స్కాన్లో బయటపడ్డ షాకింగ్ విషయం..
వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం
For More AP News and Telugu News
Updated Date - Apr 26 , 2025 | 04:01 AM