Weather: రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి
ABN, Publish Date - May 29 , 2025 | 04:03 AM
రాష్ట్రంలో ప్రవేశించిన రెండు రోజుల్లోనే తెలంగాణ అంతటా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది.
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు
5 జిల్లాలకు ఆరెంజ్.. 15 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ
ఆదిలాబాద్ జిల్లాలో సత్నాల నదిలో యువకుడి గల్లంతు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): రాష్ట్రంలో ప్రవేశించిన రెండు రోజుల్లోనే తెలంగాణ అంతటా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది. అలాగే, అక్కడక్కడ గంటకు 40-50 కి.మీ వేగంగా వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, భారీ వర్షాలు కురిసే 15 జిల్లాలకు యెల్లో అలర్జ్ జారీ చేస్తున్నట్లు వాతావరణ విభాగం పేర్కొంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని గుండాలలో అత్యధికంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. 80 మినహా రాష్ట్రంలోని 612 మండలాల్లో వర్షాలు కురిశాయి. 39 మండలాల్లో అతి భారీ వర్షపాతం, 211 మండలాల పరిధిలో ఓ మోస్తరు వర్షపాతం రికార్డయింది.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగర శివారుల్లోని దుండిగల్ వద్ద రైతులు ఎండబోసిన ధాన్యం తడిసి మొలకెత్తింది. ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకూ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా 44.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వైరా రిజర్వాయర్ నీటి మట్టం 18.3 అడుగుల నుంచి 14.8 అడుగులకు చేరుకుంది. వికారాబాద్ జిల్లా దోమలో 49.3మి.మీ వర్షపాతం నమోదు కాగా, బషీరాబాద్, బొంరా్సపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. తాండూరు పట్టణంలో సాయంత్రం రెండుగంటల పాటు వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో జైనథ్ మండలం సాత్నాల నది ఉప్పొంగింది. ఈ నదిపై నిర్మించిన తాత్కాలిక లోలెవల్ బ్రిడ్జి వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో ఆదిలాబాద్ నుంచి మోటారు సైకిల్పై బయలుదేరిన మండలంలోని లక్ష్మిపూర్ వాసి లాండేదత్తు (30).. వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి 40 రోజుల క్రితం తరలించిన ధాన్యం కాంటా పెట్టక పోవడంతో పిచ్చిరాంతండా వాసులు భూక్యా గోరి, భూక్యా ఈరీ అనే మహిళా రైతులు తహసీల్దార్ రమేశ్ బాబు కాళ్లు మొక్కి తమ ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. దంతాలపల్లి మండలం కమ్మరికుంట్లలో కాంటా వేసిన ధాన్యం మొలకెత్తిందంటూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేయగా, తమ ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లాలోని బొల్లంపల్లి వాసులు రాస్తారోకో చేశారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..
Updated Date - May 30 , 2025 | 03:01 PM