FCI Bribery Scam: ఎఫ్సీఐ పేరుతో వసూళ్ల దందా
ABN, Publish Date - Jun 30 , 2025 | 02:48 AM
కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ అప్పగింతకు గడువు పెంచాలని కేంద్రాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది..
సీఎంఆర్ గడువుపెంపుతో తెరపైకి దళారులు.. ఉత్తర్వులు తామే తెచ్చామని ప్రగల్భాలు
ఎఫ్సీఐ అధికారులకివ్వాలంటూ వసూళ్లు
జిల్లాకు రూ.3 నుంచి రూ.5 లక్షల టార్గెట్
గతంలోనూ ఇదే తీరంటూ మిల్లర్ల ఆవేదన
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అప్పగింతకు గడువు పెంచాలని కేంద్రాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరింది! దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది! అయితే గడువు పెంచడానికి తామే కారణమంటూ కొంతమంది దళారులు ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసి అనుమతులు తెచ్చామంటూ వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక్కో జిల్లాకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల చొప్పున టార్గెట్ పెట్టి వసూలు చేసేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రైస్మిల్లర్ల నుంచి వసూళ్లు మొదలుకావటం చర్చనీయాంశంగా మారింది. ఎఫ్సీఐ అధికారులకు ముడుపులు ముట్టజెప్పేందుకే వసూళ్లు చేస్తున్నట్లు దళారులు చెబుతున్నారు. యాసంగి(2023- 24)లో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 48 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈధాన్యాన్ని రైస్మిల్లుల్లో మరాడించి 67 శాతం రికవరీ లెక్కన... 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ(ఎ్ఫసీఐ)కు అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకు 27 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ను ఎఫ్సీఐకి అప్పగించగా... ఇంకా 5 లక్షల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి డెలివరీ చేయాల్సి ఉంది. అయితే గత మార్చి నెల 27 తేదీ నాటికి తుది గడువు పూర్తయ్యింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ప్రయత్నాలతో కేంద్ర స్పందించి పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్, మే నెలలో మరాడించిన బియ్యంతోపాటు జూలై 27 తేదీ వరకు మరాడించిన బియ్యాన్ని కూడా తీసుకునేలా అవకాశం కల్పించింది.
జిల్లాల వారిగా టార్గెట్
ఈ అంశాన్ని రైస్మిల్లర్ల సంఘం నేతలు తమకు అవకాశంగా మలుచుకొని వసూళ్ల పర్వానికి తెరలేపారు. సీఎంఆర్ బకాయిలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని జిల్లా అసోసియేషన్లకు టార్గెట్ పెట్టారు. పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు ఎఫ్సీఐ అధికారులకు రూ. 50 లక్షలు ముట్టజెప్పాల్సి ఉన్నదని, మిగిలిన డబ్బులు అసోసియేషన్ ఖర్చులకనిచెప్పి వసూలు చేస్తున్నారు. రాష్ట్ర నేతలకు పట్టున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాల నుంచి వసూళ్లకు శ్రీకారం చుట్టారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, అధికారుల పర్యవేక్షణతో వచ్చిన పొడిగింపు ఉత్తర్వులకు... డబ్బులు ఎందుకు చెల్లించాలని కొందరు రైస్మిల్లర్లు ఎదురు తిరిగారు. అయితే ఈ వసూళ్ల పర్వంలో పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారుల పేర్లను కూడా అసోసియేషన్ నేతలు ప్రస్తావిస్తున్నారు. దీంతో కొంతమంది మిల్లర్లు భయపడి కమీషన్ ముట్టజెప్తున్నారు.
వసూళ్లపై మిల్లర్లలో చర్చ..
ఎఫ్సీఐకి అప్పగించాల్సిన బియ్యం 5 లక్షల మెట్రిక్ టన్నులున్నాయి. కోటి నుంచి కోటిన్నర వరకు వసూలుచేసిన సొమ్మును ఏంచేస్తారు? ఈ వసూళ్లు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే జరుగుతున్నాయా? లేకపోతే రైస్మిల్లర్ల సంఘం నేతలే ‘చెట్టుపేరుచెప్పి కాయలమ్ముకున్నటు’! వసూళ్లు చేస్తున్నారా? అని అంశంపై మిల్లర్లలో చర్చజరుగుతోంది. గతంలో కూడా సీఎంఆర్ పొడిగింపు ఉత్తర్వులు వచ్చినప్పుడల్లా... టన్నుకు ఇంత అని, డబ్బులు వసూళ్లు చేసిన సందర్భాలున్నాయని పలువురు వాపోతున్నారు.
Updated Date - Jun 30 , 2025 | 07:09 AM