Electric Vehicles: హైస్పీడ్లో.. ఎలక్ట్రిక్ వాహనాలు
ABN, Publish Date - Aug 04 , 2025 | 05:34 AM
రాష్ట్ర రోడ్లపై విద్యుత్ వాహనాలు రయ్యిన దూసుకెళుతున్నాయి. విద్యుత్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
రాష్ట్రంలో పెరిగిన కార్లు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు
రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుతో ఊతం
నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటంతో ఆ వైపు మొగ్గు
ఏడు నెలల్లో రోడ్డెక్కిన కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు 50 వేలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లపై విద్యుత్ వాహనాలు రయ్యిన దూసుకెళుతున్నాయి. విద్యుత్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతున్నట్టు రవాణా శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు కూడా అంతకంతకు దూసుకెళుతున్నాయి. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో 50 వేలకుపైగా విద్యుత్ వాహనాలు కొత్తగా రోడ్డెక్కాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం మినహాయించడంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయని.. ఇప్పటివరకు రూ.369.27 కోట్ల మేర పన్ను మినహాయింపు లభించిందని రవాణాశాఖ వర్గాలు తెలిపాయి.
పన్ను మినహాయింపులతో తగ్గిన ‘ఆన్ రోడ్’ ధరలు
పర్యావరణహిత హైదరాబాద్ లక్ష్యంగా ఎలక్ట్ర్టిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు నిర్ణయం తీసుకుంది. 2024 నవంబరు 16వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోంది. సాధారణంగా కేటగిరీని బట్టి వాహనం ధరలో 12 శాతం నుంచి 20 శాతం వరకు రోడ్ ట్యాక్స్ (లైఫ్ ట్యాక్స్)గా చెల్లించాలి. వాణిజ్యేతర వాహన కేటగిరీలో ఎక్స్ షోరూం ధర రూ.5లక్షల్లోపు ఉన్న కార్లకు రోడ్ ట్యాక్స్ 13 శాతం, రూ5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంటే 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల్లోపు వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే వాహనాలకు 18 శాతం రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం కార్లకు రూ.2500 నుంచి రూ.5 వేల వరకు.. ద్విచక్ర వాహనాలకు రూ.500-800 వరకు చార్జీ ఉంటుంది. ఈ క్రమంలో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపుతో.. ఒక్కో కారుపై కనిష్టంగా రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ‘ఆన్ రోడ్’ ధర తగ్గుతోంది. కొత్త సాంకేతికతలతో వస్తున్న విద్యుత్ వాహనాల మైలేజీ ఎక్కువగా ఉంటోంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే కార్లు.. 40 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ చార్జింగ్తో నడవడం, ఇతర నిర్వహణ వ్యయాలు పెద్దగా ఉండకపోవడం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది.
50 వేల వాహనాలు.. 369.27 కోట్ల మినహాయింపు..
నవంబరు 16 నుంచి జూన్ 30 వరకు ఏడున్నర నెలల్లో రాష్ట్రంలో అన్ని కేటగిరీల విద్యుత్ వాహనాలు కలిపి 50 వేలకుపైగా రిజిస్ట్రేషన్ జరిగాయి. వీటన్నింటికీ కలిపి రూ.369.27 కోట్ల మేర పన్ను మినహాయింపు లభించింది. అందులో 9,058 వ్యక్తిగత (నాన్ ట్రాన్స్పోర్ట్) విద్యుత్ కార్లకు సంబంధించి రూ.302.12 కోట్ల పన్ను, రుసుముల మినహాయింపు లభించింది. ఇది మొత్తం మినహాయింపులలో 82 శాతం కావడం గమనార్హం. ‘2017 నుంచి 2024 వరకు ఈ స్థాయిలో విద్యుత్ కార్ల రిజిస్ట్రేషన్ జరగడం ఇదే ప్రథమం. అది కూడా ఏడు నెలల్లోనే జరిగాయి’ అని రవాణా శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 37 వేల విద్యుత్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి రూ.43.82 కోట్లు పన్ను, రుసుము మినహాయింపు దక్కింది. వాణిజ్య పరంగా వినియోగించే విద్యుత్ కార్లు, ఆటోలు, సరుకు రవాణా వాహనాలు, బస్సుల రిజిస్ట్రేషన్లు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 04 , 2025 | 05:34 AM