Bandi Sanjay: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు త్వరలోనే మోదీ కిట్లు
ABN, Publish Date - Jul 10 , 2025 | 03:40 AM
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ అతి త్వరలో మోదీ కిట్లు అందించనున్నామని, వీటిలో ఎల్కేజీ నుంచి ఆరో తరగతి విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులు ఉంటాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
విద్యా రంగానికి మోదీ సర్కారు ఎనలేని ప్రాధాన్యం
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్
కరీంనగర్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి
కరీంనగర్, జూలై 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ అతి త్వరలో మోదీ కిట్లు అందించనున్నామని, వీటిలో ఎల్కేజీ నుంచి ఆరో తరగతి విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులు ఉంటాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమలో ఎప్పటికప్పుడు సమాజానికి సేవ చేయాలన్న స్ఫూర్తి నింపిన నాయకుడు మోదీ అని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రతిపాదించారని, ఆ ఆలోచనతోనే ఈ రోజు పదో తరగతి విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇవి ప్రభుత్వ నిధులు కావని, అలా అని తాను కోట్లు ఖర్చు పెట్టేంత సంపన్నుడిని కాదని తెలిపారు. కొందరు కార్పొరేట్ కంపెనీల యజమానులు ఇచ్చిన సీఎస్సార్ ఫండ్తో సైకిళ్లను కొని పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యారంగానికి మోదీ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో విద్యా రంగం ముందుకు సాగుతుందనే నమ్మకంతోనే జాతీయ విద్యా విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పాఠశాలలను నడిపే బాధ్యతను, స్థానిక భాషలో పాఠ్యంశాల బోధనను పర్యవేక్షించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. తాను ఎంపీగా ఉన్నంత కాలం ఏటా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను అందజేయనున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 03:40 AM