ACB Raids: ఏసీబీ మెరుపు దాడులు!
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:14 AM
అవినీతి ఆరోపణల నేపథ్యంలో రవాణా శాఖతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, సరిహద్దు చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు.
రవాణా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు
ఏకకాలంలో పలు చెక్పోస్టుల్లోనూ సోదాలు
ఏసీబీ అదుపులో 28 మంది ఏజంట్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): అవినీతి ఆరోపణల నేపథ్యంలో రవాణా శాఖతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, సరిహద్దు చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ, కామారెడ్డి, పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయాలతో పాటు పలు సరిహద్దు చెక్పోస్టుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీ నగదుతో పాటు పలువురు ఏజెంట్ల నుంచి వాహన ధ్రువీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లెర్నింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, వాహన యజమాన్య హక్కు బదిలీ, తదితర సేవల నిమిత్తం రవాణా శాఖ కార్యాలయాలకు వస్తున్న ప్రజలు ఏజంట్లు ద్వారా వెళ్తేనే రవాణాశాఖ అధికారులు పనులు చేస్తున్నారని, నేరుగా వస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపఽథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో ఫీజులు కన్నా ఎక్కువ నగదుతో కార్యాలయంలోకి వచ్చిన పదిమంది ఏజంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిర్మల్గిరి రవాణా శాఖ కార్యాలయంలో తలుపులు మూసివేసి అక్కడి సిబ్బందిని సోదాలు చేశారు. తిరుమలగిరిలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే, 18 మంది ఏజంట్లను ఏసీబీ అఽధికారులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని సలబత్పూర్ చెక్పోస్టులో జరిపిన సోదాల్లో లెక్కలకు అదనంగా ఉన్న రూ.1.81 లక్షలను, పెద్దపల్లి రవాణా కార్యాలయంలో రూ.60 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో 91 వేలు స్వాధీనం చేసుకున్నామని, ఇక్కడ అవకతవకలు గుర్తించామని ప్రభుత్వానికి నివేదికను పంపనున్నామని ఏసీబీ డీజీ విజయ్కుమార్ తెలిపారు.
ఏసీబీ వలలో ముగ్గురు
ఆదిలాబాద్లో ఇద్దరు అధికారులు.. సూర్యాపేటలో పంచాయతీ కార్యదర్శి అరెస్టు
ఆదిలాబాద్/ పెన్ పహాడ్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఇద్దరు అధికారులు, ఒక ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ పట్టణంలో చేపట్టిన రోడ్డు పనుల బిల్లు ఇవ్వడానికి సంబంధిత కాంట్రాక్టర్ను రూ.20 వేలు లంచం ఇవ్వాలని మున్సిపల్ అకౌంట్స్ అధికారి రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ రవి కుమార్ డిమాండ్ చేశారు. చివరికి రూ.15 వేలకు బేరం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు రాజ్కుమార్, రవికుమార్లకు గురువారం బాధిత కాంట్రాక్టర్ రూ.15 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. సూర్యాపేట జిల్లా నాగులపాటి అన్నారం శివారులో బొగ్గుల బట్టి పెట్టుకునేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీశ్ డిమాండ్ చేశారు. చివరకు రూ.8,000 ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. కానీ, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ సిబ్బందితో పంచాయతీ కార్యాలయంపైనా, సూర్యాపేటలోని సతీష్ ఇంట్లో తనిఖీ చేసి, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - Jun 27 , 2025 | 03:14 AM