వేలాడే రైలుకు 125 సంవత్సరాలు...
ABN, Publish Date - Aug 17 , 2025 | 11:50 AM
నగరాల్లో ట్రాఫిక్ సమస్య తెలిసిందే. రోడ్లు ఎంత విస్తరించినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. అందుకే కొన్ని నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించారు. అయితే 125 ఏళ్ల క్రితమే జర్మనీలో భిన్నమైన రైలు సర్వీసును ప్రారంభించారు.
మన నగరాల్లో మెట్రో రైలంటే... పట్టాల మీద పరుగులు తీస్తుంది. కానీ పట్టాలకు వేలాడుతూ ప్రయాణించే మెట్రో రైలు కూడా ఉంది. ‘హ్యాంగింగ్ ట్రైన్’గా పిలిచే ఈ రైలు ప్రయాణికులతో పాటు, రోడ్డు మీద వెళ్తున్న సందర్శకులకూ కనువిందు చేస్తుంది. జర్మనీలోని ఈ పురాతన రైలు ఇటీవలే 125 ఏళ్లు పూర్తి చేసుకుంది.
నగరాల్లో ట్రాఫిక్ సమస్య తెలిసిందే. రోడ్లు ఎంత విస్తరించినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. అందుకే కొన్ని నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించారు. అయితే 125 ఏళ్ల క్రితమే జర్మనీలో భిన్నమైన రైలు సర్వీసును ప్రారంభించారు. సాధారణ రైలుకి, ఈ రైలుకి ఒక్కటే తేడా. అది పట్టాల మీద కాకుండా... వేలాడుతూ ప్రయాణిస్తుంది. ‘సస్పెన్షన్ మోనోరైల్’గా పిలిచే ఈ రైలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. శతాబ్దం క్రితం ఈ రైల్వే లైను నిర్మించాలనుకున్నప్పుడు ‘సరికొత్త ఆలోచన’ అని అందరూ మెచ్చుకున్నారు. వందేళ్లు దాటినా... ఇప్పుడు కూడా రైల్వే లైనును పరిశీలించినవాళ్లు సూపర్బ్ అనకుండా ఉండలేరు. జర్మనీలోని వుప్పెర్టల్ నగరంలో కనిపిస్తుందీ పురాతన హ్యాంగింగ్ ట్రైన్. ప్రపంచంలో వేలాడే రైలు ఇదొక్కటే.
ఇంజనీరింగ్ అద్భుతం...
1898లో ఆలోచన రాగానే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైల్వే లైన్ నిర్మాణపు పనులు శరవేగంగా మొదలెట్టారు. మూడేళ్లకు... ట్రయల్స్ విజయవంతం అయిన తర్వాత... 1901లో రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇరుకైన దారుల్లో ఉన్న కట్టడాలను తొలగించకుండా ఉండేందుకు, రైల్వే లైనును నగరంలో ప్రవహించే వుప్పర్ నదిపై ఎక్కువ దూరం నిర్మించారు. నగరంలో ఈ రైల్వే లైను 13.3 కిలోమీటర్ల మేర ఉంటుంది. హ్యాంగింగ్ రైలు సగటున గంటకు 25.6 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. అత్యధిక వేగం గంటకు 60 కి.మీ. భూమికి 26 నుంచి 29 అడుగుల ఎత్తులో ఈ రైలు పరుగులు తీస్తుంది. విశేషమేమిటంటే... 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేలాడే రైలు ప్రయాణం అత్యంత సురక్షితమైనదిగా పేర్కొంటారు. ఇన్నేళ్లలో ఒకే ఒక్కసారి ప్రమాదం జరిగింది.
1999లో నిర్వహణ సిబ్బంది ట్రాక్పై ఉన్న క్లాంప్ను తొలగించక పోవడంతో ఒక రైలు బోగీ కింద ఉన్న నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మరిన్ని జాగ్రత్తలు తీసుకొని, ప్రయాణికుల్లో భరోసా నింపారు.
ఇప్పటికీ నిత్యం 80వేల మంది ప్రయాణికులు ఈ రైలులో రాకపోకలు సాగిస్తుంటారు. స్టేషన్లను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తారు. ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. 1900లో ఉపయోగించిన టెస్ట్రైడ్ రైలు బోగీ ‘కైసర్ వ్యాగెన్’ను ఇప్పటికీ భద్రంగా, శుభ్రంగా ఉంచారు. పర్యాటకుల కోసం ఆ బోగీని అందంగా ముస్తాబు చేశారు. మెత్తటి సీట్లు, గోల్డ్ డెకరేటివ్ కిటికీలు, ల్యాంప్లతో ఈ బోగీ పర్యాటకులకు కనువిందు చేస్తూ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. దీనిని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తారు.
అనేక సినిమాల్లో...
ఎన్నో ప్రత్యేకతలున్న ఈ వేలాడే రైలు సహజంగానే సినిమాలకు ప్రధాన ఆకర్షణ అయ్యింది. డచ్ దర్శకుడు పీటర్ డెల్పీట్స్ 1992లో తెరకెక్కించిన ‘లిరికల్ నైట్రేట్’ అనే సినిమాలో ఒక సీక్వెన్స్ కోసం వాడుకున్నారు. అదేవిధంగా జర్మన్ ఫిల్మ్మేకర్ విమ్ వెండర్స్ 1974లో తీసిన ‘అలైస్ ఇన్ ది సిటీస్’, 2000లో టామ్ టైక్వర్ రూపొందించిన ‘ది ప్రిన్సెస్ అండ్ ది వార్’ మొదలైన సినిమాల్లో కూడా ఇది కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 17 , 2025 | 11:50 AM