Jawahar Project: జవహార్ ఎత్తిపోతల పథకానికి మంత్రుల శంకుస్థాపన
ABN, Publish Date - Aug 10 , 2025 | 09:34 PM
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని వంగవీడులో రూ. 630.30 కోట్లతో జవహార్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని వంగవీడులో రూ. 630.30 కోట్లతో జవహార్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ నీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. జవహార్ ప్రాజెక్ట్ కోసం చాలా ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నామన్నారు.
అసెంబ్లీలో గళమెత్తినా గత ప్రభుత్వం దాని గురించి ఆలోచనే చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారన్నారు.
ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని అనుమతులు ఇచ్చారని చెప్పారు. వారికి నా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా మధిర ప్రాంత ప్రజలు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమని ఆయన ఆభివర్ణించారు.
10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఇల్లు అయినా నిర్మించాడా? అని ప్రజలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సన్న బియ్యం పంపిణి చేశాడా? అంటూ ప్రజలను అడిగారు.
రూ. 12 వేల కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రజా సంక్షేమంపై మాత్రమే ఉంటుందని.. అంతే కానీ ఓట్లపై ఉండదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. అపర భగీరథుడని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు రైతులకు తొలిసారి నీరు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కంకణం కట్టుకున్నారని తెలిపారు. దశబ్ద కాలంగా జవహార్ ఎత్తిపోతల పథకాన్ని నిర్విరం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతోందని మండిపడ్డారు.
నాగార్జునసాగర్ నీరు పాలేరు రిజర్వాయర్ ద్వారా వైరాకు అక్కడి నుంచి మధిర, ఎర్రిపాలెం మండలాలకు సాగునీరు.. తాగునీరు అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి ప్రణాళికలు రచించారని వివరించారు. అందుకు రూ.630. 30 కోట్లతో ఈ రోజు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Aug 10 , 2025 | 09:37 PM