CM Revanth Reddy in kamareddy: వరద బాధితులను ఆదుకొంటాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Sep 04 , 2025 | 03:59 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా కామారెడ్డి అతలాకుతలమైంది. దీంతో ఆ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకుంటామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.
తమ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకొంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వందేళ్లలో ఎన్నడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందన్నారు. కష్టం వచ్చినప్పుడు అండగా ఉండే వారే నిజమైన నాయకులని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్.. బాధితులకు అండగా ఉండి ఆదుకున్నారని చెప్పారు.
కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని ఈ సందర్భంగా నాయకులకు సీఎం సూచించారు. గురువారం.. సెప్టెంబర్ 4వ తేదీన భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా.. పంట నష్టపోయిన ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు, బాధితులకు ఆయన ధైర్యం చెప్పారు. బురుగిద్ద వద్ద ఇసుక మేటలు వేసిన పొలాలను ఆయన పరిశీలించారు.
తమకు జరిగిన నష్టాన్ని సీఎంకు రైతులు వివరించారు. అలాగే లింగంపేట్లో బ్రిడ్జి పరిస్థితిని ఆయన పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
ఈ ప్రాంతంలో బ్రిడ్జి కమ్ చెక్డ్యామ్ తరహాలో వారధి నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు.
వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్నారు. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడిందని స్పష్టం చేశారు. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశామని వివరించారు.
మీ కష్టాలతోపాటు స్థానికంగా జరిగిన నష్టాలను చూడటానికే తాము ఇక్కడకు వచ్చామన్నారు. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.
పంట నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. రహదారులు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేసేందుకు అధికారులు త్వరతిగతిన అంచనాలు రూపొందించాలని సూచించారు. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వారికి భరోసా కల్పించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
వరదలతో పేదలు, రైతులే కాకుండా.. విద్యార్థులు సైతం నష్టపోయారన్నారు. దీంతో విద్యార్థులందరికీ వెంటనే పుస్తకాలు అందజేయాలని ఆదేశించామన్నారు. వరదల్లో నష్టపోయిన బీడీ,ఇతర పరిశ్రమ కార్మికులను ఆదుకుంటామన్నారు.
తనకు కొడంగల్ ఎలాగో.. కామారెడ్డి కూడా అంతేనంటూ కుండ బద్దలు కొట్టారు. అధికారుల అప్రమత్తతతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. ముంపు ప్రాంత ప్రజలను కలుసుకునేందుకే తాను వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Sep 04 , 2025 | 04:02 PM