East Coast Maritime Logistics Summit: ఏపీలో లాజిస్టిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 02 , 2025 | 09:47 PM
ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నోవాటెల్లో ఏర్పాటు చేసిన చేసిన ఈస్ట్ కోస్ట్ మారీటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నోవాటెల్లో ఏర్పాటు చేసిన చేసిన ఈస్ట్ కోస్ట్ మారీటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు చర్చించారు.
దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్గా మారుతుందన్నారు. భవిష్యత్తులో రహదారులు, రైలు, సముద్రం, ఎయిర్ లాజిస్టిక్స్ పెరుగుతాయని తెలిపారు. రహదారులు అనుసంధానం జరిగినట్లు నదులను కూడా కలపాలని నొక్కి చెప్పారు. నేడు నివాసాలపైనే విద్యుదుత్పత్తి చేసుకుంటున్నామని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగేలా అనేక చర్యలు చేపట్టామన్నారు.
ఏఐ, క్వాంటమ్ వ్యాలీ పరిధి రోజు రోజుకు విస్తరిస్తుందని పేర్కొన్నారు. డ్రోన్లు, రోబోటిక్స్, ఐవోటీ, సెన్సార్లను వాడుతున్నామని గుర్తు చేశారు. ప్రతి రంగంలోనూ స్పష్టమైన సమాచారం ఉందని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించామని గుర్తు చేశారు.
వన్ ఫ్యామిలీ.. వన్ ఆంట్రపెన్యూర్.. అనేది తన లక్ష్యమని స్పష్టం చేశారు. నీటి భద్రత విషయంలో సమస్యలు ఉన్నాయని.. అందులో భాగంగా దేశంలో నదులు అనుసంధానం చేపట్టాలని ఎప్పటి నుంచో తాను కోరుతున్నట్లు చెప్పారు గంగా నుంచి కావేరీ వరకు నదులను అనుసంధానం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందన్నారు. ఇది మనకు పెద్ద ఆస్తి అని పేర్కొన్నారు. ప్రస్తుతం బల్క్ రూపంలోనే 90 శాతం కార్గో రవాణా చేస్తున్నామన్నారు.
ఎయిర్ కార్గో ద్వారా వేగంగా సరకులు పంపిణీ చేయవచ్చునని ఆయన సోదాహరణగా వివరించారు. రైలు కనెక్టివిటీలో ఏపీ చాలా అనుకూలంగా ఉందన్నారు. లాజిస్టిక్స్ విషయంలో ఈస్ట్కోస్ట్లో మనదే అగ్రస్థానం కావాలన్నారు.
ఇప్పటికే మనకు 6 పోర్టులు ఉన్నాయని చెప్పారు. మరికొన్ని పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. 2046 నాటికి పోర్టులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక పోర్టు ఉండేలా చూస్తామన్నారు.
ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానమని స్పష్టం చేశారు. షిప్ బిల్డింగ్ విషయంలో మనదేశం చాలా వెనుకబడి ఉందని చెప్పారు.
ఈ సమ్మిట్ వేదికగా ఎయిర్ కార్గో ఫోరమ్ ఇండియా లోగోను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సమిట్లో దాదాపు 20 కంపెనీల సీఈవోలు పాల్గొన్నారు.
Updated Date - Sep 02 , 2025 | 09:48 PM