స్త్రీ శక్తికి నూతన శక్తి.. ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Aug 15 , 2025 | 09:33 PM
మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం 79వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత బస్సు పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో స్త్రీ శక్తి పథకం పేరిట ప్రారంభించారు.
విజయవాడ బస్ స్టేషన్లో జెండా ఊపి లాంఛనంగా ఉచిత బస్సులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఉండవల్లి సెంటర్, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి సెంటర్, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణించినంతసేపు మహిళలను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవం అనంతరం విజయవాడ సిటీ బస్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు, టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.
మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది చంద్రబాబు సర్కార్. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు.
సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్తో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. 'స్త్రీ శక్తి' పథకం ద్వారా ఏకంగా 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.
Updated Date - Aug 15 , 2025 | 09:33 PM