AP Minister Nara Lokesh: సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ షిప్ వల్లే రాష్ట్రానికి గ్లోబల్ పరిశ్రమల రాక
ABN, Publish Date - Aug 29 , 2025 | 07:24 PM
విశాఖపట్నం వేదికగా ఏరో స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్, సీఐఐ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ షిప్ వల్లే ఆర్సెలర్స్ మిట్టల్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.
విడి భాగాల నుంచి పోటీతత్వం వరకు భారతదేశ ఏరో స్పేస్ తయారీ, ఎంఆర్ఓ (Maintenance, Repair, and Operations) రంగాలను వేగవంతం చేయడం అనే అంశంపై భారత విమానయాన మంత్రిత్వశాఖ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫాక్చరర్స్ సంయుక్తంగా విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ వేదికగా శుక్రవారం (ఆగస్టు 29) జరిగిన సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... చంద్రబాబు శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించినపుడు 5 వేల ఎకరాలు ఎందుకంటూ కొందరు విమర్శలు చేశారని గుర్తు చేశారు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో 11 శాతం.. ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్టు వల్లే తెలంగాణ రాష్ట్రానికి సమకూరుతోందని వివరించారు. నేడు అదే విజనరీ నేతృత్వంలో మనకు భోగాపురం ఎయిర్ పోర్టు రాబోతోందని చెప్పారు.
దీని ద్వారా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు పని చేస్తోందన్నారు. సుందరమైన విశాఖపట్నం నగరంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టమ్ అందుబాటులో ఉందని గుర్తు చేశారు.
విజన్ -2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఏటా 15 శాతం వృద్ ధిరేటు సాధించాల్సి ఉందన్నారు. స్పష్టమైన విజన్తో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు ముఖ్యమైన అనుకూలతలు ఇక్కడ ఉన్నాయని.. అందులో ఒకటి విజనరీ లీడర్ షిప్, రెండోది అనుభవజ్ఞులైన యువ నాయకత్వం, మూడవది స్టార్టప్ రాష్ట్రం అని వివరించారు. సీఎం చంద్రబాబు విజన్, సమర్థ నాయకత్వంలో ఈ రాష్ట్రం పెట్టుబడులకు గమ్య స్థానంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో ఏరోస్పేస్, డిఫెన్స్ సలహాదారుగా సతీష్ రెడ్డి లాంటి ప్రముఖులు కీలకమైన సలహాలు అందిస్తున్నారని.. సాయికాంత్ వర్మ వంటి యువ ఐఎఎస్ అధికారులు పెట్టుబడులను పర్యవేక్షిస్తున్నారని ప్రశంసించారు. భారతదేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన రామ్మోహన్ నాయుడు లాంటి యువ నాయకత్వం ఏపీలో ఉందని గుర్తు చేశారు. అక్టోబర్లో ఆర్సెలర్స్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు.
ఆసియాలోనే అతిపెద్దదైన గూగుల్ డాటా సెంటర్ కూడా రాబోతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా అడుగులు వేస్తున్నామని.. దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును రెన్యూ సంస్థ ఇప్పటికే రాయలసీమలో పనులు ప్రారంభించిందని గుర్తు చేశారు.
మీరు ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకున్నాక అది మీ ప్రాజెక్ట్ కాదు.. పూర్తి బాధ్యత తమదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు సులభతరమైన అనుమతుల కోసం విధానపరమైన మార్పులు తీసుకు వచ్చామన్నారు.
ప్రధాని మోదీ వికసిత్ భారత్, చంద్రబాబు విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం $180 బిలియన్ డాలర్లు ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్లకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్లో విమానయాన, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు ఇద్దరు నాయుడులు (చంద్రబాబునాయుడు, రామ్మోహన్ నాయుడు) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని చమత్కరించారు.
ప్రపంచంలో గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓఇఎంలు, ఎంఎస్ఎంఇలు, స్టార్టప్లు, విద్యావేత్తలు తమతో కలసి పనిచేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఏరోస్పేస్ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నేలపై నిర్మితమవుతోందని.. ఇక్కడ పెట్టుబడులు పెట్టి, కొత్త ఆవిష్కరణలు చేయాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఎంఎస్ఎంఇ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సిఐఐ ఏపీ చైర్ పర్సన్ గన్నమని మురళీకృష్ణ, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సిఇఓ సాయికాంత్ వర్మ, ఏపీ ఏరోస్పేస్ & డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి, జిఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ సిఇఓ కరణ్ బీర్ సింగ్ కల్రా, సిఐఐ డిప్యూటీ డైరెక్టర్ సోనాల్ బెనర్జీ, సయాంట్ ఫౌండర్ చైర్మన్ బివిఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 29 , 2025 | 07:24 PM