Air India Plane crash: మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్
ABN, Publish Date - Jun 12 , 2025 | 08:04 PM
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై టాటా గ్రూప్ స్పందించింది. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైద్య చికిత్స ఖర్చులు భరిస్తామని స్పష్టం చేసింది.
అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై టాటా గ్రూప్ స్పందించింది. ఈ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆ యా కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామని టాటా గ్రూప్ సంస్థ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామంది. ఎక్స్ వేదికగా టాటా గ్రూప్ స్పందిస్తూ.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171లో జరిగిన విషాద సంఘటనతో మేము తీవ్ర వేదనకు గురయ్యామంది. ఈ సమయంలో తాము అనుభవిస్తున్న ఆవేదన తెలిపేందుకు పదాలు దొరకడం లేదని తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతోపాటు గాయపడిన వారి కోసం ప్రార్థిన చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ రూ. 1 కోటి అందజేస్తుందని వివరించింది. గాయపడిన వారి వైద్య ఖర్చులను సైతం తాము భరిస్తామని స్పష్టం చేసింది. వారి సంరక్షణ బాధ్యత తమదేనని చెప్పింది. బిజె మెడికల్ హాస్టల్ నిర్మాణంలో తమ వంతు సహాయ సహాకారం అందిస్తామని వివరించింది.
స్పందించిన నగర పోలీస్ కమిషనర్..
మరోవైపు ఈ ప్రమాద ఘటన నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. 11ఏ సీటు ప్రయాణికుడు రమేశ్ బతికారన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్ బిశ్వాస్కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని వివరించారు. ఈ ప్రమాద మృతుల సంఖ్యపై ఇప్పడే తామేమీ చెప్పలేమన్నారు. నివాస ప్రాంతంలో విమానం కూలినందున మృతుల సంఖ్య ఎక్కువే ఉండ వచ్చని అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ అభిప్రాయపడ్డారు.
జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1.39 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఆ కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 241 మంది మరణించారు. వీరిలో 229 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదగా లండన్కు ఈ విమానం వెళ్తోంది. మరోవైపు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడులు వేర్వేరుగా అహ్మదాబాద్కు చేరుకుని ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ: కేంద్ర మంత్రి
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News
Updated Date - Jun 12 , 2025 | 08:35 PM