Operation Sindoor: యావత్ పాక్ను టార్గెట్ చేసే మిలిటరీ సామర్థ్యం భారత్కు ఉంది: ఆర్మీ ఉన్నతాధికారి
ABN, Publish Date - May 20 , 2025 | 10:33 AM
పాకిస్థాన్లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసే సత్తా భారత్కు ఉందని ఆర్మీ అధికారి లెఫ్టెనెంట్ జనరల్ డీకున్హా అన్నారు. మిలిటరీ ప్రధాన కార్యాలయాన్ని మార్చినా ఉపయోగం ఉండదని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: యావత్ పాక్లో ఏ టార్గెట్పైన అయినా దాడి చేసే మిలిటరీ సామర్థ్యం భారత్కు ఉందని భారత ఆర్మీ అధికారి లెఫ్టెనెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీకున్హా తెలిపారు. యావత్ పాకిస్థాన్ మన దాడుల పరిధిలోనే ఉందని అన్నారు. రావల్పిండిలోని పాక్ మిలిటరీ ప్రధాన కార్యాలయాన్ని మార్చినా ఉపయోగం ఉండదని చెప్పారు. ఓ పెద్ద గొయ్యి తవ్వుకుని అందులో దాక్కోవడం మినహా దాయాదికి మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు.
‘‘యావత్ పాక్లో ఏ చోటునైనా టార్గెట్ చేసుకునే ఆయుధ సంపత్తి భారత్కు ఉంది. మొత్తం పాకిస్థాన్ మన పరిధిలో ఉంది. ఆర్మీ హెడ్క్వార్టర్స్ను రావల్పిండి నుంచి మూలన ఉన్న ఖైబర్ఫాఖ్తున్ఖ్వాకు మార్చినా తప్పించుకోలేరు. అన్ని ప్రాంతాలు మన ఆయుధాల పరిధిలోనివే’’ అని పేర్కొన్నారు.
నాలుగు రోజుల్లో పాక్ సుమారు 800 నుంచి 1000 వరకూ డ్రోన్స్ను పశ్చిమ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ప్రయోగించిందని డీకున్హా తెలిపారు. వాటన్నిటినీ భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు సంయుక్తంగా మార్గమధ్యంలోనే ధ్వంసం చేశాయని అన్నారు.
‘‘ఆ మానవ రహిత విహంగాలన్నిటినీ పౌర స్థావరాలే లక్ష్యంగా పేలోడ్తో ప్రయోగించారన్నది సుస్పష్టం. అయితే, వీటితో ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పౌరులెవరికీ నష్టం జరగలేదు’’ అని తెలిపారు.
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాక్లోని టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. ప్రధాన ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అక్కడితో సరిపెట్టుకోలేని పాక్ ఆర్మీ.. సరిహద్దు వెంబడి ఉన్న భారత నగరాలే టార్గెట్గా డ్రోన్స్, ఆర్టిలరీ ఫైరింగ్కు దిగింది.
ఈ దాడులకు భారత్ దీటుగా స్పందించింది. పాక్ మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసింది. దీంతో, పాక్ చివరకు రాజీ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ దాడుల ప్రభావం రావల్పిండిలో బాగా తెలిసిందని రక్షణ శాఖ మంత్రి ఇటీవల వ్యాఖ్యానించారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక ఆయుధాలు ఈ దాడుల్లో కీలక భూమిక పోషించాయి.
ఇవీ చదవండి:
ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటే.. భారత్కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 11:14 AM