Operation Sindhu: ఇరాన్ నుంచి భారత్ చేరిన మరో 292 మంది
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:24 PM
ఇరాన్ నుంచి ఇంతవరకూ 2,295 మంది భారతీయులను వెనక్కి తీసుకు వచ్చినట్టు రణ్ధీర్ జైశ్వాల్ చెప్పారు. వీరితో పాటు ఇజ్రాయెల్లో నివసిస్తున్న 165 మంది భారతీయులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-17 మిలటరీ రవాణా విమానంలో భారత్కు తీసుకువచ్చారు.
న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ సింధు' (Operation Sindhu) కొనసాగుతోంది. తాజాగా ఇరాన్ నుంచి మరో 292 మంది భారతీయులు న్యూఢిల్లీ చేరుకున్నారు. మసాద్ నుంచి వీరంతా ప్రత్యేక విమానంలో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు న్యూఢిల్లీ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు.
ఇరాన్ నుంచి ఇంతవరకూ 2,295 మంది భారతీయులను వెనక్కి తీసుకు వచ్చినట్టు జైశ్వాల్ చెప్పారు. వీరితో పాటు ఇజ్రాయెల్లో నివసిస్తున్న 165 మంది భారతీయులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-17 మిలటరీ రవాణా విమానంలో భారత్కు తీసుకువచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరిని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ రిసీవ్ చేసుకున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గత వారంలో 'ఆపరేషన్ సింధు'ను చేపట్టింది. భారతీయులను తరలించేందుకు ఇరాన్ ప్రభుత్వం తమ గగనతలాన్ని తెరవడంతో అక్కడి భారతీయులను ప్రత్యేక విమానాల్లో భారత్కు తరలిస్తున్నారు. ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై ప్రతిదాడులు జరుపుతుండటంతో ఇజ్రాయెల్లోని భారతీయులనూ 'ఆపరేషన్ సింధు'తో వెనక్కి రప్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నా మాటలు బీజేపీలో చేరడానికి సంకేతం కాదు
హీరో విజయ్కి అన్నాడీఎంకే గాలం.. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్..
For National News And Telugu News
Updated Date - Jun 24 , 2025 | 03:38 PM