Congress Leaders: శివ.. శివా... ఏమిటీ వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:20 AM
నిజాయితీ, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత కామరాజర్పై డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ తిరుచ్చి శివ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. శివ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ నెల 15న పెరంబూరులో జరిగిన డీఎంకే సభలో తిరుచ్చి శివ ప్రసంగిస్తూ కామరాజర్ ఏసీ లేకుండా ఉండలేరని, చనిపోవటానికి ముందు కరుణానిధి చేతులు పట్టుకుని, రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వేడుకున్నారన్నారు.
- భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
- కామరాజర్పై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: నిజాయితీ, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత కామరాజర్పై డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ తిరుచ్చి శివ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. శివ వ్యాఖ్యలపై కాంగ్రెస్(Congress) శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ నెల 15న పెరంబూరులో జరిగిన డీఎంకే సభలో తిరుచ్చి శివ ప్రసంగిస్తూ కామరాజర్ ఏసీ లేకుండా ఉండలేరని, చనిపోవటానికి ముందు కరుణానిధి చేతులు పట్టుకుని, రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వేడుకున్నారన్నారు. తాను 23 యేళ్ల వయస్సులో ఉన్నప్పుడు కరుణానిధితో కారులో వెళ్తుండేవాడినని, ఆ సమయంలో రాష్ట్రానికి చెందిన నాయకుల సంగతులు కూడా చెప్పేవారని,
ఆ ప్రకారమే ఓ రోజు ఇద్దరం కలిసి కారులో వెళ్తుండగా విద్యుత్కోతపై కామరాజర్ రాష్ట్రమంతటా నిరసన సభలు జరుపుతున్నారని, అయితే కామరాజర్కు ఏసీ లేకుంటే అలెర్జీ వస్తుందని, ఆ కారణంగానే ఆయన బసచేసే గెస్ట్హౌ్సలకు ఏసీ సదుపాయం కల్పించాలని తాను ఆదేశించినట్టు కరుణానిధి చెప్పారని శివ పేర్కొన్నారు. అంతేకాకుండా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కామరాజర్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారని, ఆ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసేందుకు కూడా సిద్ధమైందని, ఈ వివరాలన్నింటిని ఆయనకు తెలియజేసి, తమిళనాట ఉంటే కామరాజర్ అరెస్టు కాకుండా తాను కాపాడగలనని చెప్పినట్లు కరుణానిధి తనకు వివరించారని శివ తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియోగా వెలువడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తిరుచ్చి శివ వ్యాఖ్యలపై భగ్గున మండిపడ్డారు.
అవన్నీ కట్టుకథలు: టీఎన్సీసీ
డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ వ్యాఖ్యలపై టీఎన్సీసీ నేత సెల్వపెరుంతగై స్పందిస్తూ ఆధారాలు లేకుండా కామరాజర్ కీర్తి ప్రతిష్టలను దిగజార్చేలా విమర్శించటం గర్హనీయమన్నారు. కామరాజర్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మాట్లాడుతూ డీఎంకే చేసిన దుష్ప్రచారం వల్లే ఎన్నికల్లో కామరాజర్ ఓడిపోయారనే విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. వాస్తవానికి ప్రభుత్వ అతిథిగృహంలో వేడిగా ఉందంటూ కామరాజర్ చెట్టునీడలో ఖద్దరు తువ్వాలు పరచుకుని నిద్రపోయేవారని ఆమె తెలిపారు.ఏసీ లేకుండా కామరాజర్ నిద్రపోరని తిరుచ్చి శివ చెప్పినదం తా అసత్యమన్నారు.
గతంలో కామరాజర్పై డీఎంకే నేతలు అల్లిన కట్టుకథల కొనసాగింపే తిరుచ్చి శివ విమర్శలని జ్యోతిమణి పేర్కొన్నారు. నామ్ తమిళర్కట్చి నేత సీమాన్ వ్యాఖ్యానిస్తూ ‘డీఎంకేకు ఓటు వేయడం,దొంగను ఇంటికి రమ్మని ఆహ్వానించడం లాంటిదని చెప్పిన కామరాజర్ అంత్యకాలంలో కరుణానిధి చేతులుపట్టుకుని నీవే దేశాన్ని కాపాడాలని వేడుకున్నారని చెబుతుండటం అభూత కల్పనే అని విమర్శించారు.ఇదే విధంగా తమిళ మానిల కాంగ్రెస్ నేత జీ కే వాసన్, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్, ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి తదితరులు కూడా ఎంపీ శివ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడటంతో తిరుచ్చి శివ స్పం దించారు. కామరాజర్ జయంతి సందర్భంగా పెరంబూరు సభలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనతో చెప్పిన మాటలనే తాను గుర్తు చేశానని,ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.
తిరుచ్చి శివ ఇంటి ముట్టడి యత్నం...
కామరాజర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తిరుచ్చి శివ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గురువారం తిరుచ్చిలోని ఆయన నివాసగృహాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. మొదట టీఎన్సీసీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది శరవణన్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు తిరుచ్చి శివాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో జరిపారు. ఆ తర్వాత తిరుచ్చి శివ ఇంటివైపుగా ర్యాలీ జరిపారు. పోలీసులు మధ్యలోనే వారిని అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో శివాజీ పేరవై అధ్యక్షుడు శివాజీ షణ్ముగం, తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..
బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే..
Read Latest Telangana News and National News
Updated Date - Jul 18 , 2025 | 11:20 AM