central government: వక్ఫ్ ఆస్తులకు పోర్టల్.. నోటిఫై చేసిన కేంద్రం
ABN, Publish Date - Jul 06 , 2025 | 02:24 AM
దేశంలో ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వక్ఫ్ ఆస్తులను సక్రమంగా నిర్వహించేందుకు, అభివృద్ధి చేసేందుకు, వక్ఫ్కు మరింత సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
న్యూఢిల్లీ, జూలై 5: దేశంలో ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వక్ఫ్ ఆస్తులను సక్రమంగా నిర్వహించేందుకు, అభివృద్ధి చేసేందుకు, వక్ఫ్కు మరింత సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం ప్రత్యేక పోర్టల్, డేటాబేస్ ద్వారా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, ఆడిట్, అకౌంట్ల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చిన 2025, వక్ఫ్ సవరణ చట్టంలో పొందుపరిచిన 1995 నాటి చట్టంలోని సెక్షన్ 108బీ ప్రకారం ఈ నిబంధనలు తీసుకువచ్చినట్టు కేంద్రం పేర్కొంది. ఆయా నిబంధనల అమలు, పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖలోని సంయుక్త కార్యదర్శికి అప్పగించారు.
వక్ఫ్ పోర్టల్ సహా డేటాబేస్కు సంబంధించిన వివరాలను పర్యవేక్షించేందుకు, కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు, సహాయకారిగా ఉండేందుకు వీలుగా ప్రతిరాష్ట్ర ప్రభుత్వం ఓ నోడల్ అధికారిని నియమించాలి. ఈ అధికారి రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాను కలిగి ఉండాలని కేంద్రం వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించే నోడల్ అధికారి.. తన పరిధిలోని వక్ఫ్ ఆస్తులను గుర్తించి జాబితాను అధికారికంగా ప్రచురించాలి. అనంతరం 90 రోజుల్లో దీనిని పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పోర్టల్,డేటాబేస్లపై ముతావలికే నియంత్రణ ఉంటుంది. అయితే, జిల్లా కలెక్టర్కు కూడా పోర్టల్, డేటాబేస్ యాక్సస్ ఉంటుంది.
Updated Date - Jul 06 , 2025 | 02:38 AM