Cabinet: రూ.5,801 కోట్లతో లక్నో మెట్రో ఫేజ్-1Bకి కేంద్రం ఆమోదం
ABN, Publish Date - Aug 12 , 2025 | 08:28 PM
లక్నో ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడంలో ఇదొక మైలురాయి అని, ఫేజ్-1బి వినియోగంలోకి రాగానే లక్నోకు 34 కిలోమీటర్ల మేర యాక్టివ్ మెట్రో నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
లక్నో: రూ.5,801 కోట్ల అంచనా వ్యయంతో లక్నో మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-1బి (Lucknow Metro Project Phase-IB)కి కేంద్ర క్యాబినెట్ మంగళవారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లక్నో ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడంలో ఇదొక మైలురాయి అని, ఫేజ్-1బి వినియోగంలోకి రాగానే లక్నోకు 34 కిలోమీటర్ల మేర యాక్టివ్ మెట్రో నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
మోదీ నాయకత్వం భేష్ : యోగి
కేంద్ర మంత్రి వర్గం తాజా నిర్ణయంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రను ప్రశంసించారు. మోదీ విజయవంతమైన నిర్దేశకత్వం, నిరంతర సహకారంతో ఈరోజు ఉత్తరప్రదేశ్ ఆసాధారణ అభివృద్ధి జర్నీ సాగిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి పయనంలో లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1బి ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇందుకు రక్షణ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
పాత లక్నో కీలక హబ్లను కలుపుతూ..
కొత్త కారిడార్తో సుమారు 11.165 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ విస్తరిస్తుంది. ఏడు అండర్ గ్రౌండ్, ఐదు ఎలివేటెడ్ స్టేషన్లను కలుపుతూ వెళ్తుంది. కమర్షియల్ హబ్లుగా పేరున్న అమినాబాద్, యహియాగంజ్, పాండేయ్గంజ్, చౌక్తో సహా పాత లక్నోలోని కీలక జోన్లను కలుపుతుంది.
ఇవి కూడా చదవండి..,
పౌరసత్వానికి ఆధార్ను పరిగణనలో తీసుకోలేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
సెల్ఫీ ముచ్చట..మరోసారి సహనం కోల్పోయిన జయాబచ్చన్
For More National News and Telugu News
Updated Date - Aug 12 , 2025 | 08:29 PM