PM Modi At SCO Summit: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు: ఎస్సీఓ సదస్సులో మోదీ పిలుపు
ABN, Publish Date - Sep 01 , 2025 | 06:38 PM
ఎస్సీఓలో భారతదేశం కీలక భూమిక పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎస్సీఓకు కొత్త నిర్వచనం చెప్పారు. ఎస్ అంటే సెక్యూరిటీ, సీ అంటే కనెక్టివిటీ, ఓ అంటే ఆపర్చునిటీ అని తెలిపారు. భద్రత, అనుసంధానం, అవకాశం అని చెప్పారు.
బీజింగ్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ఉగ్రవాదం, సార్వభౌమాధికారం, పరస్పర సహకారం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని సభ్య దేశాలను కోరారు. ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొక సభ్యదేశం గౌరవించాలని సూచించారు. భారదేశం గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఎన్నో కష్టనష్టాలను చవిచూసిందని అన్నారు. గ్లోబల్ నేతలను ఘనంగా స్వాగతించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ధన్యవాదాలు తెలియజేశారు.
ఎస్సీఓకు కొత్త నిర్వచనం
ఎస్సీఓలో భారతదేశం కీలక భూమిక పోషిస్తుందని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీఓకు మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. ఎస్ అంటే సెక్యూరిటీ, సీ అంటే కనెక్టివిటీ, ఓ అంటే ఆపర్చునిటీ అని తెలిపారు. భద్రత, అనుసంధానం, అవకాశం అని చెప్పారు. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏర్పాటు అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ఎస్ఓఈ కింద 'సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం' ఏర్పాటును పరిశీలించాలని కోరారు.
పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన
భారత్ నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని, ఇటీవలనే ఉగ్రవాద వికృతరూపం పహల్గాం (Pahalgam)లో తాము చవిచూశామని మోదీ చెప్పారు. అలాంటి విషాద సమయంలో భారత్కు బాసటగా నిలిచిన మిత్రదేశాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని సభ్యదేశాలు చాలాస్పష్టంగా, ఏకగ్రీవంగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు.
'పహల్గాం ఉగ్రదాడి మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికీ, ప్రతి ఒక్క దేశానికి బహిరంగ సవాలు వంటిది. కొన్ని దేశాలు బహిరంగంగా ఉగ్రదానికి మద్దతు పలుకుతుంటే అది మనకు ఆమోదయోగ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తడం సహజం. మనమంతా ఏకగ్రీవంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాలి. మానవత్వం పట్ల ఇది మనకున్న బాధ్యత కూడా' అని మోదీ స్పష్టం చేశారు.
భద్రత, శాంతి, సుస్థిరత
ఏదేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, సుస్థిరత అనేవే పునాదులని, ఈ మార్గంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం పెనుసవాళ్లని అన్నారు. ఇందువల్ల ఏ దేశం, ఏ సమాజం, ఏ పౌరుడు కూడా సురక్షితంగా ఉండలేరని, ఆ కారణంగానే ఉగ్రవాదంపై సమైక్య పోరు సాగించాలని ఇండియా గట్టిగా చెబుతోందని పేర్కొన్నారు. జాయింట్ ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ ద్వారా అల్ ఖైదా, ఇతర టెర్రరిస్టు సంస్థలపై పోరుకు ఇండియా చొరవ తీసుకుందని, ఉగ్రనిధులకు వ్యతిరేకంగా గళం విప్పిందని, ఇందుకు మీ అందరి మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
సార్వభౌమాధాకారాన్ని గౌరవించకపోవడమంటే విశ్వాసాన్ని కోల్పోవడమేనని ప్రధాని పరోక్షంగా పీఓకే గుండా వెళుతున్న పాకిస్థాన్, చైనా కారిడార్ను ప్రస్తావిస్తూ అన్నారు. బలమైన కనెక్టివిటీ వల్ల వాణిజ్యం పెరుగుతుందని, పరస్పర విశ్వాసం పెరిగేందుకు ఈ చర్య దోహదపడుతుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకునే చబహార్ పోర్ట్, ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కోసం తాము చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ఇందువల్ల అఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియాతో అనుసంధానం మెరుగవుతుందని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎస్ఈఓ రూపుదిద్దుకుంటూ ఉండటం చాలా సంతోషంగా ఉందని మోదీ ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్
ఎస్సీఓ సమిట్లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 01 , 2025 | 06:40 PM