Prashant Kishore: విపక్ష అభ్యర్థులను బెదిరిస్తున్న ఎన్డీయే.. ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ
ABN, Publish Date - Oct 21 , 2025 | 05:14 PM
నామినేషన్లు వేసిన వారిని బెదిరించి వాటిని ఉపసంహరించుకోవడం ద్వారా పోటీ లేకుండా గెలవాలనే సూరత్ మోడల్ను బీజేపీ అమలు చేయాలనుకుంటోందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణల పర్వం ఊపందుకుంటోంది. ఎన్నికల రేసులో ఉన్న విపక్ష అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అధికార ఎన్డీయే బెదిరిస్తోందని జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) సంచలన ఆరోపణ చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎన్డీయే ఈ చర్యలకు పాల్పడుతోందని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. 'కొద్ది సంవత్సరాలుగా ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేననే రెప్యుటేషన్ను బీజేపీ తెచ్చుకుంది. ఇప్పుడు బీహార్లో కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారం మొదలు కావడంతో బీజేపీ బెదిరింపులకు దిగుతోంది. మాకు ఓటేయండి.. లేదంటే లాలూ జంగిల్ రాజ్ మళ్లీ వసోంది.. అని చెబుతోంది. గత నాలుగైదు రోజులుగా ముగ్గురు జన్ సురాజ్ అభ్యర్థులను బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసింది' అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
అభ్యర్థులకు భద్రత కల్పించండి
ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్ను కోరారు. నామినేషన్లు వేసిన వారిని బెదిరించి వాటిని ఉపసంహరించుకునేలా చేయడం ద్వారా పోటీ లేకుండా గెలవాలనే సూరత్ మోడల్ను బీజేపీ ఇక్కడ కూడా అమలు చేయాలనుకుంటోందని ఆయన ఆరోపించారు. కాగా, జన్సురాజ్ పార్టీ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టింది. తాజాగా ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో 240 సీట్లకు ఇప్పుడు పరిమితమైంది.
ఇవి కూడా చదవండి..
విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 21 , 2025 | 05:15 PM