Man Shoots Dogs: 25 వీధి కుక్కలను రైఫిల్తో కాల్చి చంపిన నరరూప రాక్షసుడు.. రాజస్థాన్లో దారుణం
ABN, Publish Date - Aug 07 , 2025 | 07:05 PM
రాజస్థాన్లో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఝుంఝ్నూ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన గ్రామంలోని 25 వీధి శునకాలను రైఫిల్తో కాల్చి చంపేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్లోని ఝుంఝ్నూ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డుమ్రా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 25 వీధి కుక్కలను బలి తీసుకున్నాడు. బైక్పై వాటిని వెంబడించి రైఫిల్తో కాల్చి చంపేశాడు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. రక్తసిక్తమైన వీధి శునకాల మృత దేహాలు గ్రామవీధుల్లో పడి ఉండటం చూసి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, నిందితుడు శివ్చంద్ బవేరియా.. వీధుల్లో సంచరిస్తూ తనకు ఎదురుపడ్డ ప్రతి కుక్కపై రైఫిల్తో కాల్పులకు తెగబడ్డాడు. వాటిని వెంబడించి మరీ అంతమొందించాడు. ప్రాణభయంతో కుక్కలు వణికిపోతున్నా అతడు కనికరించలేదు. మోటర్ సైకిల్పై వెంబడించి మరీ కాల్పులు జరిపాడు. రెండు రోజుల పాటు వీధుల్లో తిరుగుతూ పలు వీధి శునకాలను చంపేశాడు. అతడి బారిన పడి సుమారు 25 కుక్కలు మరణించాయి. రక్తసిక్తమైన వీధి శునకాల మృతదేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం రాజ్యమేలింది. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలో బవరియాతో పాటు మరో వ్యక్తి బైక్పై వెళుతూ కనిపించాడు.
ఆగస్టు 2, 3 తేదీల్లో ఈ ఉదంతం జరిగింది. ఘటనపై ఆగస్టు 4న దర్యాప్తు ప్రారంభించినట్టు స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. బవరియాపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడితో పాటు బైక్పై కనిపించిన మరో వ్యక్తి గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ దారుణంలో అతడి పాత్ర ఎంతో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు.
ఈ ఘటనపై స్థానికులు, జంతుప్రేమికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్థానికులు ఈ వియాన్ని కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ.. పీఎం కిసాన్ యోజన పేరుతో..
ఇన్స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..
Updated Date - Aug 07 , 2025 | 07:17 PM