Hyderabad: రైల్లో వచ్చి చోరీ.. విమానంలో పరారీ
ABN, Publish Date - Aug 12 , 2025 | 07:08 AM
వారంతా రాజస్థాన్లో స్నేహితులు.. బతుకుదెరువుకు నగరానికి వచ్చిన వ్యక్తి వారిని రైల్లో రప్పించి పథకం ప్రకారం ఓ మొబైల్ దుకాణంలో దోపిడీ చేయించాడు. విలువైన సెల్ఫోన్లు ఉన్నా వాటి జోలికి వెళ్లకుండా కేవలం క్యాష్కౌంటర్లోని రూ.9లక్షల నగదును దోచుకుని విమానంలో పరారయ్యారు. దర్యాప్తు చేసిన నగర పోలీసులు ఫోన్పే లావాదేవీలతో ఆ ముఠాను అరెస్ట్ చేసింది.
- రాజస్థాన్ దొంగల ఆటకట్టించిన సిటీ కాప్స్
- ఆరుగురి అరెస్టు, రూ. 8లక్షలు స్వాధీనం
- దొంగల గుట్టు రట్టు చేసిన ఫోన్ పే
హైదరాబాద్ సిటీ: వారంతా రాజస్థాన్లో స్నేహితులు.. బతుకుదెరువుకు నగరానికి వచ్చిన వ్యక్తి వారిని రైల్లో రప్పించి పథకం ప్రకారం ఓ మొబైల్ దుకాణంలో దోపిడీ చేయించాడు. విలువైన సెల్ఫోన్లు ఉన్నా వాటి జోలికి వెళ్లకుండా కేవలం క్యాష్కౌంటర్లోని రూ.9లక్షల నగదును దోచుకుని విమానంలో పరారయ్యారు. దర్యాప్తు చేసిన నగర పోలీసులు ఫోన్పే లావాదేవీలతో ఆ ముఠాను అరెస్ట్ చేసింది. ఈస్టుజోన్ డీసీపీ బాలస్వామి(East Zone DCP Balaswamy) అంబర్పేటలోని తన కార్యాలయంలో సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్కు చెందిన మానస రామ్దేవసి సుల్తాన్ బజార్లోని గుజరాత్ గల్లీలో ఓ మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. అదే రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన పరశురామ్ను అతను చేరదీసి తన దుకాణంలో పనికి పెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత యజమాని నుంచి వేరుపడిన పరశురామ్ తాను సొంతంగా అదే ప్రాంతంలో దుకాణం పెట్టుకున్నాడు. అయితే, పరశురామ్ దుర్బుద్ధితో తన యజమాని దుకాణంలో చోరీ చేయాలని పథకం రచించాడు.
ఆదివారమే దోపిడీ చేసేలా ప్లాన్..
పరశురామ్ జూలైలో రాజస్థాన్లో ఉన్న తన స్నేహితులు జైసారామ్, నాగాజి రామ్, లీలారామ్, లక్ష్మణరామ్ అలియాస్ శ్రవణ్, జబరరామ్కు కబురుపెట్టి నగరానికి రప్పించాడు. దోపిడీ పథకాన్ని వారికి వివరించాడు. వారం రోజులపాటు జరిగిన బిజినెస్ డబ్బులు మొత్తం యజమాని సోమవారం బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు కాబట్టి ఎప్పుడు చోరీ చేసినా ఆదివారం రోజే చేయాలని, తద్వారా ఎక్కువ డబ్బు దోచుకోవచ్చని వారికి చెప్పాడు. పథకంపై పూర్తి కసరత్తు చేసి వారు వెళ్లిపోయారు.
ఈనెల 2న రైల్లో ఆ ముఠా సభ్యులు హైదరాబాద్ చేరుకుని లాడ్జిలో దిగారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో దోపిడీకి ప్లాన్ చేశారు. దుకాణం షట్టర్ను తెరిచి ముగ్గురు వ్యక్తులు లోపలికి వెళ్లగా.. ఇద్దరు దుకాణం బయట కాపలాగా ఉన్నారు. దుకాణంలోకి వెళ్లిన వారు సెల్ఫోన్లను ముట్టుకోకుండా కేవలం క్యాష్ కౌంటర్లో దాచిన రూ.9లక్షలు దోచుకొని, సీసీటీవీ ఫుటేజీ రికార్డు బాక్సును తీసుకుని అందరూ విమానంలో సూరత్కు పారిపోయారు.
గుట్టురట్టు చేసిన లావాదేవీలు
దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించిన యజమాని మాసర రామ్దేవసి సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలను సేకరించి ఆ దొంగల ముఠా బసచేసిన లాడ్జి వివరాలు తెలుసుకున్నారు. లాడ్జిలో పనిచేసే ఒక వ్యక్తి దగ్గర ఆ ముఠా సభ్యులు డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఫోన్పే ద్వారా చెల్లించారు. ఈ నంబర్ను పోలీసులు ట్రాక్ చేయగా గుజరాత్లోని సూరత్లో ఉన్నట్లు తెలిసింది.
పోలీసులు సూరత్ వెళ్లి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా పరశురామ్ ప్లాన్ ప్రకారమే దోపిడీ చేసినట్లు తేలింది. నిందితుల నుంచి రూ. 8లక్షలు రికవరీ చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులను పట్టుకున్న సుల్తాన్బజార్ ఏసీపీ మట్టయ్య, ఇన్స్పెక్టర్ నరసింహ బృందాన్ని డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ ముఠాపై రాజస్థాన్, హైదరాబాద్, నిజామాబాద్ సహా.. దేశవ్యాప్తంగా 30 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని ఓ జువెలరీ దుకాణంలో చోరీ చేసి రూ.5.7కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..
చట్టాలు తెలుసుకుని అమెరికా రండి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 12 , 2025 | 07:10 AM