Yogandhra Campaign 2025: 21 నుంచి 21 వరకు యోగాంధ్ర
ABN, Publish Date - May 20 , 2025 | 05:33 AM
మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా డే ప్రత్యేక ప్రచార కార్యక్రమం ‘యోగాంధ్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జూన్ 21న విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారు.
యోగా డేపై నెలపాటు విస్తృత ప్రచారం: సీఎస్
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్రంలోని రెండు కోట్ల మంది భాగస్వాములయ్యేలా చూడాలని, ఇందుకోసం మే 21 నుంచి జూన్ 21 వరకూ యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యోగా డే నిర్వహణపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 21న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ప్రధాని మోదీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారని, దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని, ఇందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దీనిపై మంగళవారం సర్క్యులర్ జారీ చేస్తామన్నారు. కాగా, దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కోర్టు కాంప్లెక్సుల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఇందుకోసం రూ.50 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.
ఈ సందర్భంగా యోగా డే నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకూ ‘యోగాంధ్ర’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకూ ట్రైనింగ్ అండ్ ట్రైనర్స్ శిక్షణ ఇస్తామని, 28 నుంచి జూన్ 3 వరకూ మండల స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ, జూన్ 4 నుంచి 16 వరకూ గ్రామ, వార్డు స్థాయిల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా వంద పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగా డే నిర్వహిస్తామన్నారు.
Updated Date - May 20 , 2025 | 05:34 AM