CM Chandrababu: ఇది సీఎం చంద్రబాబు పవర్..
ABN, Publish Date - Feb 01 , 2025 | 06:24 PM
Union Budget 2025: సీఎం చంద్రబాబు దావోస్ నుంచి భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన ఏపీకి రాలేదు. నేరుగా ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బడ్జెట్ ప్రిపరేషన్లో తల మునకలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోపాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన స్వయంగా కలిశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపులపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో ఇప్పటికే విమర్శలు ఎక్కుపెడుతోన్నాయి. ఇందుకు కారణం ఏపీకి జరిపిన కేటాయింపులే అని చెప్పొచ్చు. మరి అలాంటి వేళ.. గతేడాది.. అంతకు ముందు ఏడాది.. ఇంకా చెప్పాలంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధుల లెక్క, ఇప్పటి లెక్కలను బేరీజు వేస్తూ విశ్లేషకులు తమదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏటా కేంద్రం సాధారణ బడ్జెట్ ప్రవేశ పెడుతూనే ఉంది. మరి ఆ సమయంలో ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఏమైనా నిధులు కేటాయింపులు జరిగాయా? అంటే లేదని రాజకీయ విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన సాగింది. ఆ సమయంలో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సంక్షేమంపై పెట్టిన శ్రద్ద.. పాలనపై పెట్టలేదనే అపవాదు ఉంది.
ఢిల్లీ వెళ్లిన దాఖలు లేనే లేవు..
వాస్తవానికి కేంద్ర బడ్జెట్కు ముందు రాష్ట్రంలో ప్రతి ఏడాది బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతోంది. ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి.. రాష్ట్ర ప్రాధాన్యతను వివరించిన దాఖలాలు లేనే లేవని ఈ సందర్భంగా విశ్లేషకులు బల్లగుద్ది మరి చెబుతున్నారు. అందుకే.. గత వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్ట్ సైతం కేంద్ర బడ్జెట్లో కేటాయించలేదని లెక్కలు చెబుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు.
Also Read:: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?
ఇది చంద్రబాబు క్రెడిబిలిటి..
అదీ కాక గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలే పెట్టి బేడా సర్ధుకొని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పక్క రాష్ట్రానికి తరలిపోయిన అమర్ రాజా సంస్థే అందుకు అత్యుత్తమ ఉదాహరణగా చూడొచ్చు. 2014 - 2019 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన లూలూ సంస్థ సైతం.. ఆ తర్వాత.. అంటే సీఎం వైఎస్ జగన్ పాలనలో తన నిర్ణయాన్ని మార్చుకొని తమిళనాడుకు వెళ్లిపోయింది. అయితే ఇదే సంస్థ యాజమాన్యం తాజాగా మళ్లీ విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబును ఇటీవల కలిసి తన ఆసక్తిని వివరించింది. ఇది సీఎం చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీ ఫలితమనే చెప్పాలి.
Also Read: మళ్లీ ఎన్కౌంటర్: భారీగా మావోయిస్టులు హతం
పెద్ద పెద్ద ప్రకటనే తప్ప..
ఈ విషయం పక్కనబెడితే.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. మూడు రాజధానుల ప్రకటన చేయడం.. నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకొన్న పరిణామాలు అందరికి తెలిసినవే. మూడు రాజధానులపై పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన జగన్.. కనీసం ఆ రాజధానుల కోసమైనా బడ్జెట్లో మాకు ఫలానా కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని కోరిన సందర్భాలు మచ్చుకైనా ఒక్కటి లేదని విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
విభజన హామీలు సైతం కేంద్రం దృష్టికి..
రాజధానుల సంగతి పక్కనపెడితే.. విభజన హామీలు సహా ఏపీకి సంబంధించి ఇతర ప్రయోజనాలనైనా అడిగిన పాపాన పోలేదంటూ జగన్ తీరును విశ్లేషకులు ఈ సందర్భంగా ఎండగడుతున్నారు. ఆయన నిర్వాకం కారణంగానే.. ఎన్డీయే సర్కార్ ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యి చూపుతూ వచ్చిందంటున్నారు.
దశ తిరిగింది..
కానీ, చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఆంధ్రప్రదేశ్ దశ తిరిగిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన.. కావాల్సిన ప్రధాన అంశాలను సీఎం చంద్రబాబు.. ఎప్పటికప్పుడు స్వయంగా న్యూఢిల్లీ వెళ్లి కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నారు. అంతేకాదు.. తన పార్టీ ఎంపీలతో ఆయన నిత్యం టచ్లో ఉంటున్నారు. కేంద్రానికి నివేదించిన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు.. ఏ దశలో ఉన్నాయి.. అవి ఎప్పటికి పూర్తవుతాయంటూ వారి నుంచి ఆయన స్వయంగా వివరాలను సేకరిస్తున్నారు.
దావోస్లో..
అంతదాకా ఎందుకు.. ఇటీవల దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కేబినెట్లోని మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్తోపాటు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం పలు ఎంవోయూలు కుదుర్చుకొంది. తద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు దావోస్ నుంచి భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు.
దావోస్ నుంచి నేరుగా ..
అయితే, దావోస్ రిటర్న్ అయిన సీఎం చంద్రబాబు.. ఏపీకి రాలేదు. నేరుగా ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బడ్జెట్ ప్రిపరేషన్లో తల మునకలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోపాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను వారికి వివరించడమే కాకుండా.. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారికి విన్నవించారు.
ఆ తర్వాతే ఏపీకి..
ఏపీకి కావాల్సిన చిట్టా అంతా కేంద్రం వద్ద పెట్టిన తరువాతే.. సీఎం చంద్రబాబు గన్నవరానికి చేరుకున్నారు. బాబు ప్రయత్నాల ఫలితమే.. నేటి బడ్జెట్లో ఏపీకి జరిపిన కేటాయింపులు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ తరహాలో కేటాయింపులు జరిగాయింటే.. అదంతా సీఎం చంద్రబాబు పవర్ కాకుంటే మరేమిటని వారు స్పష్టం చేస్తున్నారు. విశ్లేషకులే కాదు.. నాటి ప్రభుత్వం.. నేటి ప్రభుత్వం మధ్య ఎంత తేడా ఉందో ఈ రోజు బడ్జెట్లోని కేటాయింపులు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతోందని చెబుతున్నారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 01 , 2025 | 06:24 PM