Srisailam Dam: శ్రీశైలంలో డ్యామేజీ ఎంతో తేలుద్దాం
ABN, Publish Date - Jun 02 , 2025 | 03:31 AM
శ్రీశైలంలో డ్యాం నిర్మాణానికి జరిగిన నష్టాన్ని పుణే శాస్త్రవేత్తలు అత్యాధునిక వీడియో కేమెరాలతో విశ్లేషిస్తున్నారు. దీనివల్ల నష్టానికి పూర్తి అంచనా వేసి అవసరమైన మరమ్మతులు చేపట్టడం సులభమవుతుంది.
ఎల్లుండి తర్వాత రానున్న పుణే శాస్త్రవేత్తలు
భూగర్భ జలాల వీడియోగ్రఫీ.. ఓ విశాఖ ప్రైవేటు సంస్థ కూడా..
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో జరిగిన మొత్తం నష్టమెంతో తేల్చడానికి రంగం సిద్ధమైంది. పుణేకు చెందిన కేంద్ర జల-విద్యుత్ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్ఎస్) శాస్త్రవేత్తల బృందాలు మరోసారి శ్రీశైలం వస్తున్నాయి. అత్యాధునిక కెమేరాల సాయంతో భూగర్భ జలాల్లో వీడియోలు తీయనున్నాయి. జలాశయానికి ఏర్పడిన నష్టాన్ని సమూలంగా తెలుసుకుంటే.. అవసరమైన మరమ్మతులు చేపట్టడానికి ఆస్కారం ఉంటుందని జలవనరుల శాఖ భావిస్తోంది. ఇప్పటికే అక్కడ కేంద్ర జల సంఘం, సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందాలు పర్యటించి ప్లంజ్పూల్, యాప్రాన్, అప్రోచ్ రోడ్డు, ఎత్తిపోతల పథకంతో పాటు డ్యాం పునాదుల భద్రత కోసం ఏర్పాటు చేసిన సిలెండర్లు తదితరాలను కూలంకషంగా పరిశీలించాయి. మొత్తం 62 సిలెండర్లలో 22 దెబ్బతిన్నాయని తేల్చాయి. ప్లంజ్పూల్ కంటే యాప్రాన్ దెబ్బతినడం వల్లే అత్యధిక నష్టం జరుగుతుందని సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం పేర్కొంది. యాప్రాన్ ఏమేరకు దెబ్బతిందో తెలుసుకునేందుకు వీలుగా డ్రిల్లింగ్తో రంధ్రాలు చేయాలని, ఆ శబ్దం ద్వారా డ్యాం పటిష్ఠతను అంచనా వేయొచ్చని తెలిపింది. సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందాలు బుధవారం తర్వాత శ్రీశైలం డ్యాం పరిశీలనకు వస్తామని సమాచారం ఇచ్చాయి. వీరితోపాటు విశాఖకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ కూడా అత్యాధునికమైన కెమెరాల సాయంతో అండర్గ్రౌండ్ వాటర్లో వీడియోలు తీస్తుంది. కింద పునాది భాగంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాయి. డ్యాం పటిష్ఠానికి ఏర్పాటు చేసిన 62 స్టీల్-కాంక్రీట్ సిలెండర్లలో 22 దెబ్బతిన్నాయి. మిగిలిన సిలెండర్లు కూడా ఏ మేరకు దెబ్బతిన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. వీటిని పరిశీలించాక ఇచ్చే సమగ్ర నివేదిక ఆధారంగా మరమ్మతులు చేపట్టాలని జల వనరుల శాఖ నిర్ణయించింది.
Updated Date - Jun 02 , 2025 | 03:32 AM