TDP Mahanadu 2025: టీడీపీ సక్సెస్కు టాప్ సీక్రెట్ అదే..
ABN, Publish Date - May 27 , 2025 | 08:45 AM
తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున స్థాపించడమే కాదు.. పార్టీ పెట్టిన జస్ట్ 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని.. దేశ రాజధాని హస్తినలోని నాటి హస్తం పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుట్టించిన కథానాయకుడు ప్లస్ మహానాయకుడు నందమూరి తారక రామారావు.
అమరావతి, మే 27: మహానాడు అంటేనే.. పసుపు పండగ. ఇంకా చెప్పాలంటే తెలుగు తమ్ముళ్లకు అతి పెద్ద పండగ. అలాంటి పండగకు కడప నగరం ముస్తాబు అయింది. ఈ పండగ ఈ రోజు.. అంటే మంగళవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ పండగ అంగరంగ వైభవంగా జరగనుంది.
తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున స్థాపించడమే కాదు.. పార్టీ పెట్టిన జస్ట్ 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని.. దేశ రాజధాని హస్తినలోని నాటి హస్తం పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుట్టించిన కథానాయకుడు ప్లస్ మహానాయకుడు నందమూరి తారక రామారావు. అలాంటి మహానీయుడు స్థాపించిన పార్టీ ఆయన జన్మదినం వేళ మరోసారి కడప వేదికగా మహానాడు పేరుతో మురిసిపోతుంది.
ఈ మహానాడు ప్రస్థానం..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాక ముందు అంటే.. 1982లో ఏప్రిల్ 10, 11వ తేదీలలో హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఈ మహానాడు సభను తొలిసారిగా నిర్వహించారు.
అదే ఏడాది 1982, మే 27, 28 తేదీలలో తిరుపతి త్యాగరాజ మండపంలో మహానాడు పేరుతో మరో సభను నిర్వహంచారు.
అయితే మహానాడును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28వ తేదీన నిర్వహించాలని పార్టీలోని పెద్దలు నిర్ణయించారు. దీంతో ఆ ప్రాతిపదికగా ఈ మహానాడును నిర్వహిస్తున్నారు.
ఇక టీడీపీ పాలన పగ్గాలు అందుకున్న తర్వాత విజయవాడ వేదికగా.. 1983, మే 26, 27, 28 తేదీలలో ప్రధమ మహానాడు నిర్వహించారు. ఈ మహానాడుకు జాతీయ పార్టీల అగ్రనేతలు ఎం జీ రామచంద్రన్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్.కె. అద్వానీ, చండ్ర రాజేశ్వరరావు, మేనకా గాంధీ, రామకృష్ణ హెగ్డే, మాకినేని బసవ పున్నయ్య తదితరులు హాజరయ్యారు.
1984లో విశాఖపట్నంలోని పోలీసు గ్రౌండ్స్లో మహానాడు నిర్వహించారు.
1986లో హైదరాబాద్లోని గండిపేటలో మహానాడు చేపట్టారు.
1987లో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మహానాడు నిర్వహించారు.
1988లో విజయవాడ వేదికగా మహానాడు నిర్వహించారు.
అయితే.. 1985,1989, 1991, 1995,1996, 1997, 2008, 2012, 2019, 2024 సంవత్సరాల్లో మహానాడును టీడీపీ నిర్వహించ లేదు.
ఇక 2020-21లో కరోనా విజృంభించింది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ మహానాడును డిజిటల్ పద్దతిలోకి మార్చి పార్టీ నేతలు నిర్వహించారు.
ఒంగోలులో..
2022 మే 27, 28 తేదీలలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వేదికగా మహానాడు నిర్వహించారు. ఈ మహానాడుతో తెలుగుదేశం పార్టీకి సరికొత్తగా నేతలు ఊపిరిలూదారు. ఇంకా చెప్పాలంటే.. నాటి సీఎం వైఎస్ జగన్పై ప్రత్యక్ష మాటల యుద్దానికి ఈ మహానాడు వేదికపై నుంచే పార్టీ నేతలు సమర శంఖం పూరించారు. ఆ క్రమంలో ఈ మహానాడు ద్వారా గత సీఎం వైఎస్ జగన్కు టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ మహానాడు సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో మళ్లీ అధికారానికి చేరువ కాబోతున్నామనే సంకేతాలు.. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్పష్టంగా అందాయి.
రాజమహేంద్రవరంలో..
2023 రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు తెలుగుదేశం పార్టీ సైతం సూపర్ సక్సెస్ అయింది. అంతేకాదు. 2024లో జరగనున్న ఎన్నికల ప్రణాళికలకు ఈ మహానాడు వేదికగానే అంకురార్పణ జరిగింది. సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ పధకాల వివరాలను ఈ రాజమహేంద్రవరం మహానాడులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఎన్నికల్లో సత్తా చాటిన..
2024 ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. దాంతో అధికారిక హోదాలో 2025 టీడీపీ మహానాడు .. అది కూడా వైఎస్ జగన్ సొంత ఇలాకా కడపలో నిర్వహిస్తున్నారు. మే 27, 28 తేదీలలో ప్రతినిధులతో సభలు.. అలాగే మే 29వ తేదీన అంటే చివరి రోజు.. నిర్వహించే సభకు దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఒక టాప్ సీక్రెట్..
తెలుగుదేశం పార్టీకి మహానాడు రాజకీయంగా జీవం పోస్తుంటే.. పార్టీ కార్యకర్తలకు నేతలకు, కొత్త ఊపిరిని ఇస్తుంది. ఈ మహానాడు పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం పదేళ్లు మినహా.. మిగిలిన అన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగుదేశం స్థాపించిన తర్వాతే సామాన్యులకు సైతం రాజకీయాలు ఎలా ఉంటాయనేది అర్దమైందనే విషయం అందరికి తెలిసిందే. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రజల మనస్సుల్లో నిత్యం నిలిచి ఉందంటే.. అందుకు మహానాడు కార్యక్రమం నిర్వహణ కూడా ఒకటన్నది సుస్పష్టం. తెలుగుదేశం పార్టీ సక్సెస్కు మహానాడు ఒక టాప్ సీక్రెట్.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి..
తొలి రోజు 23 వేల మంది ప్రతినిధులతో మహానాడు
For AndhraPradesh News and Telugu News
Updated Date - May 27 , 2025 | 09:04 AM