Karnataka Fatal Crash: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
ABN, Publish Date - Apr 19 , 2025 | 05:27 AM
కర్ణాటకలో రాయచూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ముగ్గురు, కర్ణాటక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
గొర్రెల కొనుగోలుకు వెళ్లి నలుగురి మృతి
మృతుల్లో ముగ్గురు శ్రీసత్యసాయి జిల్లా వాసులు
డ్రైవర్కు తీవ్ర గాయాలు
హిందూపురం/రాయచూరు, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ముగ్గురు, కర్ణాటకు చెందిన ఒకరు మృతి చెందారు. రాయచూరు జిల్లా శాహపూర్ తాలూకాలో జరిగే సంతలో గొర్రెలు కొనేందుకు వెళుతుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరి వాహనం అదుపుతప్పి అమరపురం క్రాస్ వద్ద రోడ్డు పక్క రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం ధనాపురం గ్రామానికి చెందిన నాగభూషణం(42), శీగుపల్లికి చెందిన మురళి(44), హిందూపురం మండలం కొటిపికి చెందిన నాగరాజు(40), కర్ణాటకలోని గౌరీబిదునూరు తాలూకా చిన్న బీరేపల్లికి చెందిన సోము(43) అక్కడికక్కడే మృతిచెందారు. వాహన డ్రైవర్ ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ మార్గంలో వెళ్లేవారు గమనించి, సమాచారం ఇవ్వడంతో గబ్బూరు పోలీసులు అతన్ని రాయచూరులోని రిమ్స్కు తరలించారు. మృతదేహాలను రాయచూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - Apr 19 , 2025 | 05:27 AM