MP Lavu Sri Krishna Devarayalu: అన్నదాతలకు మేలు చేసేలా ఆహారధాన్యాల సేకరణ లావు
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:35 AM
ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఆహార ధాన్యాలను సేకరించే ప్రక్రియలో రైతులకు మరింత మేలు చేకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని భారత ఆహార సంస్థ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఆహార ధాన్యాలను సేకరించే ప్రక్రియలో రైతులకు మరింత మేలు చేకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని భారత ఆహార సంస్థ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. శనివారం విజయవాడలోని ఎఫ్సీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఎస్ఎల్సీసీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ సౌరభ్గౌర్, ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ యాదవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎఫ్సీఐ కార్యకలాపాలపై సమీక్షించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాల సేకరణను మరింత పెంచాలని ఎఫ్సీఐని ప్రభుత్వం కోరిందన్నారు.
గతేడాది నిర్దేశించిన లక్ష్యంలో సగం కూడా సేకరించలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్సీఐ గోడౌన్లలో నిల్వ సామర్థ్యాన్ని, నిర్వహణలో నాణ్యత ప్రమాణాలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 70 నుంచి 80 శాతం మాత్రమే వినియోగించగలుగుతున్నారని, దీంతో ఖాళీగా ఉన్న గోడౌన్లను పౌరసరఫరాల సంస్థకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఎఫ్సీఐ గోడౌన్లపై సౌర ఫలకల ఏర్పాటు ద్వారా దాదాపు 60 మెగావాట్లకు పైగా విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు అవకాశముందని, ఈ ప్రతిపాదనపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
Updated Date - Jun 29 , 2025 | 03:35 AM