Rocks: పరదాల మాటున బండరాళ్ల తరలింపు
ABN, Publish Date - Jul 21 , 2025 | 12:43 AM
నిబంధనలకు విరుద్ధంగా, పరదాల మాటున బండరాళ్లు తరలిపోతున్నాయి.
కేవీబీపురం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా, పరదాల మాటున బండరాళ్లు తరలిపోతున్నాయి. కేవీబీపురం మండలం మఠం సమీపంలోని ఓ మైనింగ్ కంపెనీకి సంబంధించిన టిప్పర్ ఆదివారం ఉదయం 40 టన్నుల బరువైన బండరాళ్లను లోడ్ చేసుకుని పరదా కప్పి చెన్నైకి బయలుదేరింది. కేవీబీపురం పోలీ్సస్టేషన్ సమీపంలో స్పీడ్బ్రేకర్ వద్ద వాహనం వెనుక తలుపు తెరచుకుని పెద్దబండరాయి నడిరోడ్డుపై పడింది. డ్రైవర్ గుర్తించకుండా వెళ్తుండగా స్థానికులు టిప్పర్ను ఆపారు. వాళ్లు ఆపకుంటే మరో బండరాయి రోడ్డు మీద పడేది. దీన్ని గమనించిన కానిస్టేబుల్ టిప్పర్ను రోడ్డు పక్కన ఆపించారు. ఇటీవల బ్రాహ్మణపల్లె పరిసర గ్రామాల ప్రజల ఫిర్యాదు మేరకు క్రషర్ కంపెనీని సీజ్ చేశారు. అయితే యాజమాన్యం ఇక్కడ క్రషింగ్ను నిలిపి రాత్రిళ్లు డిటొనేటర్లు పేల్చి పెద్ద బండరాళ్లను టర్బోజెట్ లారీల్లో చెన్నైకి తరలిస్తోంది. ఆదివారం టిప్పర్లో నుంచి బండరాయి కిందపడటంతో అసలు గుట్టు రట్టయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సీజ్ చేసిన కంపెనీ నుంచి బండరాళ్లు ఎలా బయటకు తరలిస్తున్నారనే విషయంపై విచారణ జరిపించాల్సి ఉంది.
Updated Date - Jul 21 , 2025 | 12:43 AM