Khammam: ఖమ్మం తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత
ABN, Publish Date - May 20 , 2025 | 05:14 AM
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా ఖమ్మం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగార్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీజేపీ కార్యకర్తలకు, ఓ వర్గానికి చెందిన వ్యక్తికి మధ్య వాగ్వాదం
టూటౌన్ పోలీ్సస్టేషన్ సమీపంలో ఘర్షణ వాతావరణం
ఖమ్మం, మే19(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా ఖమ్మం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగార్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ర్యాలీ కొనసాగుతున్న క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, ఓ వర్గానికి చెందిన వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని లకారం ల్యాంక్బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు తిరంగ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ఖమ్మం టూటౌన్ సమీపంలోకి రాగానే అక్కడ ట్రాఫిక్ను అదుపు చేస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ను ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఈ ర్యాలీ ఎందుకని ప్రశ్నించడంతో ఇది విన్న బీజేపీ కార్యకర్తలు సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగారు.
ఈ వాగ్వాదం మతం పేరుతో జరుగుతున్నట్లు ప్రచారం కావడంతో రెండు వర్గాల ప్రజలు భారీగా గుమికూడారు. దాంతో ఖమ్మం టూటౌన్ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని ఇరు వర్గాలకు సంబంధించిన నేతలను, వివాదానికి కారణమైన వర్గానికి సంబంధించిన పెద్దలను పిలిపించి మాట్లాడారు. ఎవరి తప్పు ఉంటే వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, బీజేపీ మంగళవారం ఖమ్మం నగర బంద్కు పిలుపునిచ్చింది. కాగా వదంతులను ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ హెచ్చరించారు.
Updated Date - May 20 , 2025 | 05:14 AM