Hindustan Enterprises: హిందుస్థాన్ ధాన్యం టెండర్ లాట్ రద్దు
ABN, Publish Date - Jul 01 , 2025 | 04:00 AM
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)లో భాగంగా 2022-23 రబీ సీజన్లో హిందుస్థాన్ ఎంటర్ప్రైజె్సకు ఇచ్చిన ధాన్యం టెండర్ లాట్ (నంబరు 12)ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ రద్దు చేశారు.
పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వు
2022-23 రబీ సీజన్ వేలంలో కేటాయింపు
దాని బదులు సన్న బియ్యం ఇస్తామన్న మిల్లర్లు
తనకు అభ్యంతరం లేదన్న హిందుస్థాన్
80,872 మెట్రిక్ టన్నులు మిల్లింగ్ చేసి, సన్నబియ్యం ఇవ్వడానికి మిల్లర్లకు అనుమతి
ఈఎండీ వెనక్కిస్తారా!? జప్తు చేస్తారా!?
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)లో భాగంగా 2022-23 రబీ సీజన్లో హిందుస్థాన్ ఎంటర్ప్రైజె్సకు ఇచ్చిన ధాన్యం టెండర్ లాట్ (నంబరు 12)ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ రద్దు చేశారు. ఈ మేరకు మే 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో లాట్ నంబరు 12కు బదులుగా 25 శాతం నూకలతో కూడిన ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని సరఫరా చేయడానికి తమను అనుమతించాలంటూ ఐదు జిల్లాల రైస్ మిల్లర్లు ఇప్పుడు కోరారని, వారి నుంచి పౌర సరఫరాల శాఖ సన్న బియ్యాన్ని సేకరిస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ స్పష్టం చేసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి, యాసంగి (2022- 23) ధాన్యం టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ 80,873టన్నుల సామర్థ్యం కలిగిన 12వ లాటును దక్కించుకుంది. నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలోని 106 రైస్మిల్లుల్లో నిల్వ చేసిన సన్న ధాన్యానికి టన్నుకు రూ.22,599 చొప్పున కోట్ చేసింది. మార్కెట్ ఫీజు, గన్నీ బ్యాగుల ఖర్చు కలిపి రూ.24,072చొప్పున హెచ్-1 బిడ్డింగ్ ఖరారైంది.
నిబంధనల మేరకు రూ.28.55కోట్ల ఈఎండీ చెల్లించటంతోపాటు రూ.18కోట్లకు సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చింది. ఏడాదిన్నరలో కేంద్రీయ భండార్ 55 శాతం, మంచుకొండ ఆగ్రో టెక్ 68శాతం, న్యాకాఫ్ 43 శాతం ధాన్యాన్ని లిఫ్టింగ్ చేశాయి. కానీ, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఒక్క శాతం కూడా ధాన్యం ఎత్తలేదు. తాజాగా, పౌర సరఫరాల శాఖ వీసీ, ఎండీ లేఖ రాయడంతో అదే శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ ఆ లాట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్న బియ్యం సరఫరాకు అనుమతి ఇవ్వాలంటూ ఆ ఐదు జిల్లాల రైస్ మిల్లర్లు విజ్ఞప్తి చేశారని, వారి నుంచి సేకరిస్తే తనకూ అభ్యంతరం లేదని హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ పేర్కొందని, రాష్ట్ర ప్రభుత్వానికి సన్న బియ్యం అవసరం ఉన్న నేపథ్యంలో 2022-23రబీ సీజన్లో వేలం వేసిన 80,872టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని రాష్ట్ర కోటా కింద పౌర సరఫరాల శాఖకు అందించడానికి మిల్లర్లకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2 నెలల్లో సన్న బియ్యం సరఫరా చేయకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అందజేసిన ఈఎండీని జప్తు చేస్తారా!? వెనక్కి ఇస్తారా!? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. మిల్లర్ల నుంచి బియ్యం సేకరించినా అభ్యంతరం లేదంటూ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ పేర్కొనడం, టెండర్ బిడ్ను రద్దు చేయడం ద్వారా ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వడానికి పౌర సరఫరాల శాఖ అధికారులే మార్గం సుగమం చేశారని చెబుతున్నారు.
Updated Date - Jul 01 , 2025 | 04:00 AM