Operation Kagar: ఆపరేషన్ కగార్ను నిలిపేయాలి
ABN, Publish Date - Jun 18 , 2025 | 04:07 AM
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలపై కొనసాగిస్తున్న హత్యాకాండను వెంటనే నిలిపి వేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
కేంద్రం మావోయుస్టులతో చర్చలు జరపాలి
మహాధర్నాలో పలువురు వక్తల డిమాండ్
కవాడిగూడ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలపై కొనసాగిస్తున్న హత్యాకాండను వెంటనే నిలిపి వేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీ నేతలతో బేషరతుగా శాంతి చర్చలు జరిపి అడవుల్లో ఆదివాసీలకు జీవించే హక్కును పునరుద్దరించాలన్నారు. సమాజంలో శాంతిని కాపాడి, ప్రజల రాజ్యాంగపరమైన హక్కులను రక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వారు పేర్కొన్నారు. మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన మహాఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులపై సైనిక బలప్రయోగం చేస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే స్పందించి మావోయిస్టు నేతలతో చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపి వేయాలని ఆయన కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులను, నక్సలైట్లను ఒకేవిధంగా చూస్తున్నారని, టెర్రరిస్టులు, మావోయుస్టులు వేరని చెప్పారు. నక్సల్స్ ముక్త్ భారత్ కాదని అమిత్షా, మోదీ ముక్త్ భారత్ కావాలని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. చర్చలకు సిద్ధం అంటూ ప్రకటించిన మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సరికాదన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. మావోయిస్టులను చంపడం కాదని, జల్ జంగల్ జమీన్ నినాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, ఎం. అనిల్కుమార్ యాదవ్, సినీ దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, ఎమ్మెల్సీలు కోదండరాం, దాసోజు శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
21న అన్ని పాఠశాలల్లో యోగా దినోత్సవం
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ సూచించారు. ఉదయం 6:30 నుంచి 7:45 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆయన మంగళవారం అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. నిర్వహణకు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొన్న మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
Updated Date - Jun 18 , 2025 | 04:07 AM